వరి సాగులో వెదజల్లే పద్ధతిని అధికారులు ప్రోత్సహిస్తున్నారు. మూడేండ్లుగా సాగు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 79 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా.. 58 క్లస్టర్లలో సాగవుతున్నది. ప్రతి క్లస్టర్ పరిధిలో 50 మంది రైతులను ఎంపిక చేసి 100 ఎకరాల్లో పంట పండిస్తున్నారు. ఈ విధానం ద్వారా జిల్లావ్యాప్తంగా ఈ వానకాలంలో 5,800 ఎకరాల్లో సాగు చేపట్టనున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విధానం ద్వారా పంట త్వరగా చేతికి రావడం, పెట్టుబడి ఖర్చులు తగ్గడంతోపాటు సాగు నీరు ఆదా అవుతుంది. వ్యవసాయ అధికారులు కూడా ఈ విధానంపై రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
– నిర్మల్, జూలై 31(నమస్తే తెలంగాణ)
నిర్మల్, జూలై 31(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో మూడేండ్లుగా వెదజల్లే పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిలో పెట్టుబడి ఖర్చులు చాలా వరకు తగ్గుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సాధారణంగా నాట్లు వేసే పద్ధతిలో సాగు చేస్తే ఎకరాకు 25-30 కిలోల విత్తనాలు అవసరమవగా, వెదజల్లే పద్ధతిలో 8-10 కిలోలు సరిపోతాయి. నాటే ముందు కేజ్వీల్తో దమ్ము చేయించే ఖర్చు, నాట్లు వేసేందుకు కూలీల ఖర్చు మిగిలిపోతాయి. ఈ విధానంలో ఎకరాకు రూ.7వేల నుంచి రూ.8వేల వరకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు రైతులతో సమావేశాలు నిర్వహించి, వెదజల్లే విధానంపై శిక్షణనిచ్చారు. పది రోజుల ముందుగానే ఈ విధానంలో పంట చేతికొస్తుంది. రెండో పంట వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. 25-30 శాతం వరకు నీటి వాడకం తగ్గుతుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.
మరో మూడు కార్యక్రమాలు
నిర్మల్ జిల్లా పరిధిలో ఈ వానకాలంలో మరో మూడు కార్యక్రమాల అమలుకు వ్యవసాయాధికారులు కార్యాచరణ రూపొందించారు. జిల్లాలోని 79 క్లస్టర్ల పరిధిలో రైతులకు సంబంధించి 7,900 ఎకరాల్లో భాస్వరం కరిగించే బ్యాక్టీరియా వేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక కిలో ఈ ఎరువుకు రూ.50 నుంచి రూ.100 చొప్పున ఖర్చవుతుండగా.. ఒక ఎకరానికి రెండు కిలోల చొప్పున ఈ బ్యాక్టీరియా వేసినట్లయితే ఎకరానికి సగం బస్తా డీఏపీ వాడకం తగ్గించవచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో ఎకరాకు రూ.600 వరకు రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. దీంతోపాటు పచ్చి రొట్ట ఎరువులైన జనుము, జీలుగ వేయడం పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచన. అందుకనుగుణంగా ఈసారి జిల్లాలోని రైతులకు 3,700 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. మొత్తం 3,450 మంది రైతులతో 30 వేల ఎకరాల్లో జీలుగను వేసేలా చర్యలు తీసుకున్నారు. 65 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలను ప్రభుత్వం అందజేస్తున్నది.
వరి వేసే ముందు రైతులు ఈ జీలుగను వేయనున్నారు. దీంతోపాటు వివిధ దశల్లో మొక్కకు అవసరమైనప్పుడు ఎరువులు వేసే పద్దతిపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 3,950 మంది రైతులను ఎంపిక చేశారు. వారికి సంబంధించి 7,900 ఎకరాల్లో ఈ విధానంలో రైతులు సాగు చేసిన పంటలకు ఏ దశలో, ఎంత మోతాదులో ఎరువు అవసరమో తెలియజేసి సంబంధిత రైతు ద్వారానే వేయిస్తారు. ఒకే సారి వేయకుండా మొక్కలకు ఏ దశలో ఆహారం అవసరముంటుందనేది తెలియజేసి… అదే సమయంలో యూరియా, పొటాష్ వంటివి వేయించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా రైతులను ఎంపిక చేసిన అధికారులు పూర్తి స్థాయిలో ఏఈవోల పర్యవేక్షణలో కార్యక్రమాలు అమలు చేయబోతున్నారు. వీటిలో కొన్నింటిని మండల వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకులు, జిల్లా వ్యవసాయాధికారి సైతం పర్యవేక్షించనున్నారు. వెదజల్లే పద్ధతిలో వరి సాగుపై అవగాహన కల్పిస్తున్నామని నిర్మల్ జిల్లా వ్యవసాయాధికారి అంజీ ప్రసాద్ తెలిపారు.
రెండేళ్లుగా..
నాకు నిర్మల్ శివారు లోని సిద్ధాపూర్లో నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. గత రెండేళ్లు గా వ్యవసాయ అధికారుల సూచన మేరకు నాటు వేసే విధానం కాకుండా వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తున్న. దీని వల్ల ఎకరానికి రూ.5 వేలు నాటు ఖర్చు తగ్గిం ది. కేజ్వీల్తో దమ్ము కొట్టే అవసరం లేకుండా పోయింది. దీనివల్ల ట్రాక్టర్ ఖర్చులు కూడా మిగిలాయి. కేవలం కల్టివే షన్ చేసి వరి విత్తనాలను చల్లాలి. దిగుబ డి కూడా ఎకరానికి రెండు క్వింటాళ్లు అధి కంగా వస్తున్నది. ప్రభుత్వం వెదజల్లే విధా నంలో సాగు చేసే రైతులను ప్రోత్స హిస్తు న్నది.
– పిండి శ్రీనివాస్, రైతు, సిద్ధాపూర్.