నెన్నెల, జనవరి12: మారుమూల పల్లెల్లో రైతులు లాభసాటి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. కార్పొరేట్ కంపెనీలతో టయపై మేల్, ఫిమేల్ వరి సాగు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో రెండు వేల ఎకరాలకు పైగా ఈ వరి సాగు చేస్తున్నారు. ఆడ, మగ వరి సాగు చేస్తే అధిక లాభం వస్తుందని రైతులు అంటున్నారు. క్వింటాల్ ఆడ రకం ధాన్యం రూ.9500, మగ ధాన్యం రకానికి క్వింటాల్కు రూ. 1500 వరకు చెల్లిస్తున్నారు.
జిల్లాలోని నెన్నెల, బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి, తాండూర్, జైపూర్ , భీమారం మండలాల్లో ప్రతి ఏటా రెండు వేల ఎకరాలకు పైగా మేల్, ఫీమేల్ వరి సాగు చేస్తున్నారు. నీరు, 24 గంటల కరెంటు సౌకర్యం ఉన్న రైతులు విత్తన వరి సాగుకు ముందుకు వస్తున్నారు. దీనికోసం రైతులు కంపెనీలతో ముందస్తు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. విత్తనం వేసినప్పటినుంచి కోత కోసే వరకు కంపెనీల సూచనలు పాటించాల్సి ఉంటుంది. ఏ మాత్రం పొరపాటు జరిగినా రైతులు తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుంది. కాగా సీడ్ కంపెనీలే రైతులకు ఎరువులు, విత్తనాలు అందిస్తాయి.
సాధారణ వరి సాగుకన్నా ఈ మేల్, ఫిమేల్ వరి సాగు ఎంతో లాభమని రైతులు పేర్కొంటున్నారు. ఎకరం సాధారణ వరి సాగు చేస్తే 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. దొడ్డు రకానికి క్వింటాల్కు రూ.2100 ,సన్నరకాలకు రూ.2800 వరకు ధర ఉంది. ఫిమేల్ రకం ఎకరాకు 20 క్వింటాళ్లు, మేల్ రకం 5నుంచి 6 క్వింటాళ్లు వస్తుంది. ఫిమేల్ రకానికి రూ.లక్షా 70 వేల వరకు మేల్ రకానికి 8 వేల వరకు ఆదాయం వస్తుంది. పెద్ద మొత్తంలో ఆదాయం రావడంతో రైతులు ముందుకొస్తున్నారు.
సాధారణ వరికన్నా ఈ సాగు కొంత కష్టమే అయినప్పటికీ ఆదాయం అధికంగా రావడంతో రైతులు ముందుకు వస్తున్నారు. సాగు విధానం పూర్తిగా కంపెనీల చేతుల్లో ఉండడంతో వారు చెప్పినట్లే సాగు చేయాల్సి వస్తుంది. విత్తనం మొదలుకొని కోత కోసే వరకు అన్నిరకాలుగా రైతులు సంబంధిత కంపెనీల ఫీల్డ్ సిబ్బంది సూచనల ప్రకారం నడుచుకోవాలి. విత్తనం వేయడం, నైపుణ్యం గల కూలీలతో ఆడ, మగ వరి నాట్లు వేర్వేరుగా వేయాల్సి ఉంటుంది. కొలతల ప్రకారం నాటు వేసి, పూతకు వచ్చిన తర్వాత పరపరాగ సంపర్కం చేయాలి. తాడుతో పూతను ఆటు ఇటు పలు సార్లు కలియ తిప్పాలి. కోతకు వచ్చిన తర్వాత మేల్ రకాన్ని ముందుగా కోసి ప్రత్యేకంగా కుప్పలు వేయాలి. ఆ తర్వాతనే ఆడ రకాన్ని ప్రత్యేకంగా నూర్పిడి చేసి భద్రపర్చాలి.