కాగజ్నగర్, మే 24: కాగజ్నగర్ మండలం అంకుసాపూర్ గ్రామ శివారులోని అటవీ భూముల్లో హద్దులు ఏర్పాటు చేసేందుకు వచ్చిన ఫారెస్ట్ అధికారులను పోడు రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. కాగజ్నగర్ రేంజ్ పరిధిలోని కంపార్ట్మెంట్ 69లో దాదాపు 50 మంది రైతులు వ్యవసాయం చేసుకుంటుండగా, డిప్యూటీ రేంజ్ అధికారి శశిధర్ హద్దు బోర్డులు ఏర్పాటు చేయాడానికి రాగా రైతులు అడ్డుకున్నారు.
కొన్నేళ్లుగా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నామని, పట్టా పాసుబుక్లు సైతం ఉన్నాయని చూపించారు. యేటా తమను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని, రెవెన్యూ, అటవీ శాఖ జాయింట్ సర్వే నిర్వహించి తమకు న్యాయం చేయాలని కోరారు. దీంతో చేసేదేమీ లేక అటవీ శాఖ అధికారులు వెనుదిరిగారు.