నిర్మల్ అర్బన్, అక్టోబర్ 31: ఎంపీ ప్రభాకర్ రెడ్డి దవాఖానలో చికిత్స తీసుకుంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా నీచంగా మాట్లాడుతున్నాడని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభాకర్ రెడ్డి చావుబతుకుల్లో ఉంటే కోడి కత్తి డ్రామా అని రేవంత్ రెడ్డి వాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కుట్రలు, హత్యారాజకీయాలు కొత్తవి కావని అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి రేవంత్ రెడ్డి హింసా రాజకీయాలకు దిగుతున్నారని అన్నారు.
రైతుల నుంచి బీఆర్ఎస్కు మద్దతు..
నిర్మల్ బీఆర్ఎస్ ఎమెల్యే అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలోని పాక్పట్ల, గాంధీనగర్, పోచంపాడ్, మాదాపూర్ గ్రామాల రైతులు నిలిచారు. స్వచ్ఛందంగా రూ.రెండు లక్షల పదహార్లు విరాళం చెక్కును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అందించారు. పాక్పట్ల నుంచి క్యాంప్ కార్యాలయం వరకు 25 ట్రాక్టర్లతో రైతులు ర్యాలీగా తరలివచ్చారు. నిర్మల్ జిల్లా పాక్పట్లలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా నామినేషన్ ఖర్చుకోసం ఈ చెక్కును అందజేసినట్లు రైతులు తెలిపారు. విరాళం ఇచ్చిన రైతులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.