రుణం కింద పశువులు ఇప్పిస్తామని ఆరిజన్ డెయిరీ వాళ్లు మోసం చేశారు. లక్ష రూపాయలకు ఒక ఆవు లేదా ఒక బర్రె ఇస్తామని.. కనీసం రెండు పశువులైనా తీసుకోవాలనే నిబంధన పెట్టారు. ఒక్కో పశువుకు రూ.35 వేలు రైతు కడితే రూ.65 వేలు డెయిరీ భరిస్తుందన్నారు. ఈఎంఐ రూపంలో మిగిలిన మొత్తం చెల్లించాలన్నారు. పాలు కూడా తామే కొంటామన్నరు. బెల్లంపల్లిలోనే ప్లాంట్ పెడుతామని భూమిపూజ కూడా చేసిన్రు. ఇక్కడి వాళ్లకు ఉద్యోగాలు కూడా ఇచ్చిన్రు. నమ్మి డబ్బులు కట్టినం. నేను ఐదు పశువులకు రూ.1.75 లక్షలు కట్టిన. రెండు నెలల్లో పశువులు ఇస్తామని ఇవ్వలేదు. నిలదీసి అడుగగా.. ఎండీ ఆదినారాయణ ఫోన్ చేసి పశువులకు లంపీస్కిన్ వస్తున్నది.
అందుకే వేరే రాష్ర్టాల నుంచి పశువులను తీసుకురానివ్వడం లేదని చెప్పిండు. నెలలో ఇస్తామని దాటవేసిండు. చివరకు నా లాంటి రైతులందరం ఎమ్మెల్యేను కలిసినం. జనవరిలో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినం. కేసు పెట్టిన కొన్ని రోజులకు ఆదినారాయణ బెల్లంపల్లికి వచ్చాడని తెలిసి వెళ్లినం. అప్పటికే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నరు. పోలీసులు మమ్ములను పిలిచి విచారిస్తున్నరు. రైతులు ఎవరి పోలీస్స్టేషన్ పరిధిలో వాళ్లు ఫిర్యాదు చేయాలని సూచించడంతో తాండూరు, కాసిపేట, లక్షెట్టిపేటలో ఎక్కడి రైతులు అక్కడ ఫిర్యాదు చేసిన్రు. ఇప్పుడేమో ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నరు. ఏం చేయాలో అర్థం అవడం లేదు. మా డబ్బులు మాకు తిరిగి ఇప్పిస్తే చాలు.. ఇది బెల్లంపల్లికి చెందిన అమ్ముల కుమారస్వామి అనే రైతు ఆవేదన.ఇలా కుమారస్వామి ఒక్కరే కాదు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సుమారు 22 మంది రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరిజన్ డెయిరీ మా బతుకులను ఆగం చేసిందంటూ కేసులు నమోదయ్యాయి.
మంచిర్యాల, మార్చి 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆరిజన్ సంస్థ డెయిరీ పెట్టడానికి ముందు బెల్లంపల్లి నియోజకవర్గంలోని గోపాల మిత్రులను సంప్రదించింది. మీకు ప్రభుత్వం ఇస్తున్న జీతాలకు డబుల్ ఇస్తామని చెప్పి.. వాళ్లలో నుంచి యాక్టివ్గా ఉండే ఇద్దరు, ముగ్గురిని రూ.50 వేల జీతాలతో ఉద్యోగాలు ఇచ్చింది. గ్రామాల్లో తిరిగి రైతులను మొబిలైజ్ చేసే పనిని అప్పగించింది. ఇలా ఆ టీమ్ ఆరిజన్ డెయిరీ పశువులకు ఇన్సూరెన్స్ కల్పిస్తున్నదని.. రూ.708 కడితే పశువు చనిపోయినప్పుడు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు రికవరీ వస్తుందని చెప్పి దాదాపు 1200 నుంచి 1600 మంది రైతులతో ఇన్సూరెన్సులు చేయించింది.
ఆ సమయంలోనే డెయిరీ రైతులు బర్రెలు, ఆవులు కొనుగోలు చేసుకునేందుకు రుణాలు కూడా ఇస్తుందనే విస్తృతమైన ప్రచారం చేసింది. రూ.2 లక్షలతో మొదలుపెట్టి ఎంతైనా తీసుకోవచ్చని లక్ష రూపాయాలకు ఒక ఆవు లేదా ఒక బర్రె ఇస్తామని చెప్పారు. లక్ష రూపాయల్లో 35 శాతం ముందు రైతులు చెల్లిస్తే 65 శాతం సంస్థ భరిస్తుందని, దానికి గ్యారంటీగా చెక్కులు తీసుకుంటామని, తరువాత నెలవారి ఈఎంఐ రూపంలో డబ్బలు చెల్లిస్తే సరిపోతుందని ప్రచారం చేశారు. తాండూరు మండలంలో ఓ రైతుకు పశువు లు కూడా తీసుకొచ్చి ఇచ్చారు. చివరకు బెల్లంపల్లి పక్కనే ఉన్న కన్నాలలో డెయిరీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు గతేడాది జనవరి 13న భూమిపూజ చేశారు. ఇవన్నీ చూసిన రైతులు నాలుగు పైసలు సంపాదించుకోవచ్చనే ఆశతో రూ.70 వేల నుంచి రూ.3.50 లక్షల వరకు ఆరిజన్ డెయిరీకి పశువుల యూనిట్ల కోసం చెల్లించారు. ఇలా దాదాపు 22 మంది రైతులు కోట్ల రూపాయలు సంస్థకు కట్టారు.
డబ్బులు కట్టించుకొని హైదరాబాద్కు ..
రైతులతోపాటు డెయిరీలో ఉద్యోగంలో చేరిన మరి కొందరి నుంచి యూనిట్ పెట్టేందుకు రూ.కోటి వరకు అవుతుందని, మీరు రూ.10 లక్షలు ఇస్తే పార్ట్నర్లుగా చేర్చుకుంటామని చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇలా రైతులు, ఉద్యోగుల నుంచి వసూలు చేసిన మొత్తంతో హైదరాబాద్లోని ఓ ప్రముఖ అపార్ట్మెంట్కు ఆరిజన్ డెయిరీ ఎండీ ఆదినారాయణ మకాం మార్చారు. డబ్బులు చెల్లించాక ఆయన నుంచి ఎలాంటి స్పంద న లేకపోవడంతో రైతులు, డబ్బులు పెట్టి మోసపోయిన ఉద్యోగులందరూ ఆయన్ని కలిసే ప్రయత్నం చేశారు. కానీ.. ఆయన అపార్ట్మెంట్ సెక్యూరిటీ గేట్ నుంచే వారిని కలవకుండా తిరిగి పంపించేవారు. దీంతో రైతులు చేసేదేమీ లేక ఎమ్మెల్యేను ఆశ్రయించారు.
చివరకు పోలీస్స్టేషన్లో కేసు కూడా పెట్టారు. రైతుల ఆవేదన చూసి తట్టుకోలేకపోయిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రైతుబంధు కింద వచ్చే డబ్బులతో యూనిట్లు ఇప్పిద్దామనుకుంటున్నామని, మీరు వస్తే మాట్లాడుదామని చెప్పి ఆయన్ని బెల్లంపల్లి పిలిపించారు. విషయం తెలుసుకున్న రైతులు ఆయన వచ్చేప్పటికే ఎమ్మెల్యే ఇంటికి చేరుకొని నిలదీశారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులు డెయిరీ ఎండీ ఆదినారాయణరెడ్డిని విచారించగా.. ఆరిజిన్ డెయిరీ గతంలోనూ ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు తెలిసింది. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో ఈ డెయిరీపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆదినారాయణరెడ్డిని అరెస్టు చేసి 20 రోజుల రిమాండ్కు పంపించారు. అనంతరం ఆయన బెయిల్పై బయటికి వచ్చారు.
ఎమ్మెల్యేపై కక్ష..
ఎమ్మెల్యేనే తనను అరెస్టు చేయించారనే కక్షతో కొందరు ప్రతిపక్షనాయకులు, దుర్గం చిన్నయ్య వ్యతిరేకులతో టచ్లోకి వెళ్లిన ఆరిజన్ డెయిరీ ఎండీ ఎమ్మెల్యేను ఎలాగైనా ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారానికి తెర తీశారు. మహిళలను అడ్డం పెట్టుకొని లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారు. ఆధారాలుంటే చూపించాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేస్తుంటే.. వాట్సాప్ చాటింగ్లు అంటూ మార్ఫింగ్ చేయించిన వీడియోలు చూపిస్తూ అబద్ధాలను నిజం చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. రైతులను ఎందుకు మోసం చేశారు. అసలు రైతుల నుంచి డబ్బులు వసూలు చేసే అధికారం మీ డెయిరీకి ఎవరు ఇచ్చారనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఎమ్మెల్యే బహిరంగ చర్చకు వస్తే నిరూపిస్తామంటూ అర్థం లేకుండా బదులిస్తున్నారు. ఈ మేరకు బుధవారం బెల్లంపల్లి నియోజకవర్గం అనే వాట్సాప్ గ్రూప్లో ఆయన స్థానికులతో చాటింగ్ కూడా చేశారు. డెయిరీ పాయింట్ భూమి పూజకు వచ్చిన ఎమ్మెల్యే ఫొటోలు, సంస్థ ప్రతినిధులతో జరిపిన చర్చల ఫొటోలను చూపిస్తూ ఎమ్మెల్యేనే తప్పు చేసినట్లు చెబుతున్నారు తప్పితే, అంతకుమించి ఎలాంటి ఆధారాలు చూపించడం లేదు.
నాకు సంబంధం లేని విషయాల్లోకి లాగుతున్నారు : ఎమ్మెల్యే చిన్నయ్య
రైతులకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసినందుకే నాకు సంబంధం లేని విషయాల్లోకి లాగుతున్నారన్నారని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. రైతులకు మంచి జరుగుతుందని డెయిరీ భూమి పూజలో పాల్గొన్నా. తరువాత వాళ్లు వచ్చి పెట్టుబడి పెట్టాలని అడిగినా సరే అని చెప్పా. ఆ సమయంలో తీసిన ఫొటోలనే ఇప్పుడు చూపించి నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నరు. ఎవరెన్ని కుట్రలు చేసినా బెల్లంపల్లి ప్రజలను తానేంటో తెలుసు. త్వరలోనే నిజానిజాలను బయటపెట్టి, దోషులను ప్రజల ముందు నిలబెడుతా.