నిర్మల్ టౌన్, మార్చి 19 : నిర్మల్ జిల్లావ్యాప్తంగా దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు అంచనా వేస్తున్నారు. కుంటాల, దిలావర్పూర్, లోకేశ్వరం, సారంగాపూర్, భైంసా, కుభీర్, నిర్మల్ మండలాల్లో పంట ఉత్పత్తులు చేతికొస్తున్నాయి. ఈ సమయంలో మార్క్ఫెడ్ అధికారులు 40 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ.. ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,070 మద్దతు ధర ప్రకటించినప్పటికీ.. కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు ఎక్కడ అమ్ముకోవాలో తెలియక అవస్థలు పడుతున్నారు. కొందరు ప్రైవేట్ వ్యాపారులు కల్లాల వద్దకే వచ్చి మక్కను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దాదాపు రూ.200 తక్కువగా ఇచ్చి రూ.1,950కే కొంటున్నారు. మార్క్ఫెడ్ అధికారులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ధర పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని కర్షకులు కోరుతున్నారు. ఈ విషయమై అధికారులను సంప్రదించగా.. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కొనుగోళ్లు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
మద్దతు ధర కంటే రూ.200 తగ్గింది..
నా పేరు వినాయక్. నాది మెదన్పూర్. నేను వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తా. నాకు ఐదెకరాల భూమి ఉండగా.. మొక్కజొన్న వేసిన. విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం వేలల్లో డబ్బులు అయ్యాయి. గతేడాది ధర మంచిగా ఉండడం, చెల్లింపులు కూడా సక్రమంగా జరగడంతో రందీ ఉండదని మక్క వేసిన. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన. ఇప్పుడిప్పుడే పంట చేతికొస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ప్రైవేట్ వ్యాపారులేమో మద్దతు ధర కంటే రూ.200 తక్కవగా కొంటున్నా రు. ఇలా అయితే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. పంట వేసి నష్టపోయే పరిస్థితి దాపురించింది.