నార్నూర్, ఏప్రిల్ 8 : రైతులు వానకాలం సాగుకు సమాయత్తం అవుతున్నారు. రసాయన ఎరువుల వాడకం పెరగడంతో భూమిలో పోషకాల శాతం తగ్గిపోతుందని వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాల మేరకు రైతులు సేంద్రియ ఎరువుల వినియోగంవైపు ఆసక్తి చూపుతున్నారు. వానకాలం సీజన్కు రైతులు పశువుల పేడను పొలాల్లో తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. పంట ప్రయోజనంతో పాటు పెట్టుబడులు తగ్గి దిగుబడులు ఆశించిన స్థాయిలో వస్తుందని సేంద్రియ ఎరువులవైపు ఆసక్తి చూపుతున్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లో రైతులు 60వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారు. ఇప్పటికే వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సేంద్రియ ఎరువులపై మండల రైతాంగానికి అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రధానంగా పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, గొర్రెల, మేకల, కోళ్ల ఎరువులను పొలాలకు వాడుకోవాలని సూచిస్తున్నారు. సేంద్రియ ఎరువులు దఫాల వారీగా వాడుకుంటే భూమిలో పోషకాల శాతం పెరిగి భూసారం మరింత పెరుగుతుంది. పశువుల పేడను వేసుకుంటే పంట దిగుబడికి దోహదపడుతుంది. పశువుల పేడ వేసుకున్న తర్వాత దుక్కులు దున్నుకుంటే పైరు ఎదుగుదల, మొక్కలు బలంగా ఉంటాయి. ఒక్కో ఎకరానికి నాలుగు నుంచి ఐదు ట్రాక్టర్ల పశువుల పేడను ఎరువుగా ఉపయోగించాలి. సహజ సిద్ధలవణాలు పంటకు లాభపడతాయి. భూమిలో ఉన్న అమ్లాలు, క్షారాల స్థాయిని నిలబెడతాయి, నేలలోనే సూక్ష్మజీవుల వృద్ధికి తొడ్పడుతోంది.
పోషకాల వివరాలు ఇలా..
పశువుల ఎరువులో 0.5-15 నత్రజని, భాస్వరం 0.3 – 0.9, పొటాష్ 0.5-1.9 ఉంటుంది. కోళ్ల ఎరువుల్లో నత్రజని 2.3-3.0, భాస్వరం 1.2-2.0, పొటాష్ 1-2, గొర్రెల, మేకల ఎరువులో నత్రజని 0.2-07, భాస్వరం 0.4-0.6, పొటాష్ 0.1-3.0, వర్మీకంపోస్టులో నత్రజని 1.5-6.0, భాస్వరం 1.05-2.2, పోటాష్ 11-1.75 పోషకాలు ఉంటాయి. సేంద్రియ పోషకాలతో పాటు వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తే రైతులకు మేలు చేకూరుతుంది.
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి..
రసాయన ఎరువుల వాడకంతో భూసారం క్షీణించిపోతుంది. పంట దిగుబడి తగ్గుతోంది. సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పశువుల పేడలో లభించే పోషకాలతో అధిక దిగుబడి పొందవచ్చు.
–జాడి దివ్య, వ్యవసాయ అధికారి,గాదిగూడ మండలం