మంచిర్యాలటౌన్, మార్చి 20: నిధులు మంజూరై, టెండర్ ప్రక్రియ పూర్తయి, అన్ని టెస్ట్లు పూర్తి చేసుకొని ఉన్న మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు డిమాండ్ చేశారు. వంతెన నిర్మించాల్సిన ప్రదేశంలో బుధవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పర్య టించారు. అనంతరం అక్కడే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంచిర్యాల- అంతర్గాం మధ్య గోదావ రిపై వంతెన నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరగానే, ఆయన మంజూరు చేశారని తెలిపారు.
ఈ వంతెన నిర్మాణం పూర్తయితే మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా కేంద్రాల మధ్య దాదాపు 20 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని, దీంతో ఆర్థిక వ్యయం, ప్రయాణ ప్రయాస లు కూడా తగ్గుతాయని అన్నారు. ఇక్కడ వంతెన నిర్మిస్తే నే ప్రజలందరికీ మేలు కలుగుతుందని, అనవసరంగా భేషజాలకు పోయి ఇతర ప్రాంతానికి మారిస్తే ఇప్పట్లో పనులు పూర్తికాకపోగా ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, మంచిర్యాల గోదావరి వద్దే వంతెనను నిర్మించాలన్నారు. ఇప్పటికే అంతర్గాం నుంచి బసంత్నగర్ వరకు రెండు వరుసల రోడ్డు పూర్తయి ఉన్నదని, ఇవతలి పక్క చిన్న భూసేకరణ చేపడితే సరిపోతుందని చెప్పారు ట్రాఫిక్ ఇబ్బందులు అంటూ అనవసర అనుమానాలు అవసరం లేదని, కుర్మపల్లి దగ్గర నుంచి ఎటు వెళ్లాల్సిన వాహనాలు అటువైపు వెళ్తాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం నీటిప్రవాహం తక్కువగా ఉందని, పనులు త్వరగా చేపట్టాలని , వేసవికాలం ముగిసే సరికి పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ నడిపెల్లి విజిత్రావు, బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణాధ్యక్షుడు గాదెసత్యం, నస్పూర్ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, హాజీపూర్ మండలాధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్, నాయకులు మందపల్లి శ్రీనివాస్, కౌన్సిలర్ అంకం నరేశ్, తోట తిరుపతి, శ్రీరాముల మల్లేశ్, తాజుద్దీన్, ఎర్రం తిరుపతి, సుంకరి రమేశ్, గట్టయ్య, రమేశ్ యాదవ్, రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.