గోదావరిఖని, మార్చి 28: ‘అధికారం చేపట్టిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ఊదరగొట్టింది..కానీ తూతూ మంత్రంగా ఒకటో రెండో అమలు చేసి చేతులు దులుపుకున్నది.’ అంటూ చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. హామీలు నెరవేర్చని ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్దిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్న రాష్ట్రం..కాంగ్రెస్ హయాంలో దుర్భిక్షంగా మారిందన్నారు.
పంటలు ఎండుతున్నా పట్టించుకొనే నాథుడేలేడని విమర్శించారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి అండగా నిలువాల్సిన సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నాడని మండిపడ్డారు. గురువారం గోదావరిఖలో మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పాలనను గాలికొదిలి ప్రశ్నించే గొంతుకైన బీఆర్ఎస్పై ఎదురుదాడి చేయడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శంచారు. కేసీఆర్ పాలనలో పుష్కలంగా సాగునీరందిందని, సమయానికి రైతుబంధు పడ్డదని, పుష్కలంగా కరెంట్ అందిందన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి దుఃఖమే మిగిలిందన్నారు. ఆ పార్టీని ఎంపీ ఎన్నికల్లో ఒడించి బుద్ధిచెప్పాలని కోరారు.
బీజేపీని గెలిపిస్తే రిజర్వేషన్ల రద్దు..
– ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
పీడిత ప్రజానీకం కోసం తెలంగాణ వాదం, బహుజన వాదం ఒక్కటైంది..బీజేపీని ఉన్న రిజర్వేషన్లు రద్దవుతయ్. కొత్త రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి ప్రజల స్వేచ్ఛ హక్కులను హరించివేస్తుంది. మతం పేరిట ఉన్మాదంతో ఓట్లడుగుతున్న బీజేపీ అభ్యర్థిని ఓడించాలె. ఆరు గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలె. ప్రజల గొంతుకై వస్తున్న పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ బరిలో నిలిచిన కొప్పుల ఈశ్వర్ను గెలిపించుకోవాలి.
రైతాంగంపై రేవంత్ సర్కారు నిర్లక్ష్యం
– పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, ప్రజాసమస్యలను పరిష్కరిస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు ఆచరణలో విఫలమైంది. పంటలు ఎండిపోయి రైతాంగం గగ్గొలు పెడుతుంటే చోద్యం చూస్తున్నది. మరోపక్క ఉ ద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వక నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాసమస్యలను పక్కనబెట్టి బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చేస్తానని ప్రగల్బాలు పలుకుతున్నడు. కేసీఆర్ సర్కారు ఇచ్చిన రైతుబంధును నిలిపివేసింది. ఉచిత కరెంట్ను పొగొట్టింది. ఇలా అతి తక్కువ టైంల దేశంలో విఫలమైన ప్రభుత్వంగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు రుణమాఫీ చేయాలె. వరికి రూ. 500 బోనస్ ఇవ్వాలె. ఎండిన పంటలు ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాలె. స్పందించకుంటే రైతులకు అండగా ఈ నెల 30న పెద్దపల్లిలో 36 గంటల నిరసన దీక్ష చేపడుతం. రైతులు మద్దతు ప్రకటించాలె.