యూత్ ఐకాన్, ఈతరం నాయకుడు, మున్సిపల్, ఐటీ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు నేడు(సోమవారం) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, కాసిపేట మండలాల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభో త్సవాలు చేయనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, మిషన్ భగీరథ సంప్ను ప్రారంభిస్తారు. సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తారు. ఇందుకోసం అధికార యంత్రాంగం, బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. పట్టణంలోని ఏఎంసీ మైదానంలో విశాలమైన స్టేజీ వేస్తుండగా.. ఏర్పాట్లను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యవేక్షిస్తున్నారు. పర్యటనను పురస్కరించుకొని పట్టణమంతా తోరణాలు, జెండాలతో గులాబీమయంగా మారింది. కేటీఆర్తోపాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పాల్గొననున్నారు.
– బెల్లంపల్లి, మే 7
బెల్లంపల్లి, మే 7 : మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు బెల్లంపల్లి పర్యటనకు ప్రభుత్వ యంత్రాంగం, బీఆర్ఎస్ శ్రేణులు అంతా సిద్ధం చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం, బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆయనతోపాటు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోం మంత్రి మహమూద్ అలీ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఐకే రెడ్డితో కలిసి పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్లో నేరుగా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చేరుకుంటారు. ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
అక్కడి నుంచి నేరుగా బెల్లంపల్లి మున్సిపాలిటీ డంప్ యార్డు శివారులో గల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభించనున్నారు. మిషన్ భగీరథ స్కీంను మంత్రులతో కలిసి ప్రారంభిస్తారు. కాల్టెక్స్ ఏరియాలోని సనాతన అనాలటిక్స్ అండ్ రిక్యూట్మెంట్ సర్వీస్ సంస్థను పరిశీలన చేసి వారితో మాట్లాడతారు. ఏఎంసీ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. సభ అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భోజనం చేసి హెలిక్యాప్టర్లో పెద్దపల్లి జిల్లా రామగుండానికి బయలు దేరుతారు.
బెల్లంపల్లి గులాబీమయం
మంత్రుల పర్యటనను పురస్కరించుకొని బీఆర్ఎస్ శ్రేణులు బెల్లంపల్లి పట్టణమంతా గులాబీ తోరణాలు, జెండాలతో అలంకరించారు. కన్నాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి పాత బస్టాండ్, మార్కెట్ ఏరియా, ఏఎంసీ ఏరియా మీదుగా కాల్టెక్స్, ఫ్లై ఓవర్బ్రిడ్జి, రైల్వే స్టేషన్ ఏరియా వరకు బీఆర్ఎస్ జెండాలను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద మంత్రి కేటీఆర్కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున హోర్డింగ్లు పెట్టారు. ఏఎంసీ గ్రౌండ్లో సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. విశాలంగా స్టేజీతోపాటుగా పురుషులు, మహిళలకు వేరువేరుగా గ్యాలరీలు సమకూర్చారు. సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యవేక్షిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.