ఎదులాపురం, డిసెంబర్ 2 : ప్రత్యేక ఓటరు నమోదు, ఓటరు జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం-2023లో భాగంగా అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ కుమార్ వ్యాస్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ర్టాల ప్రధాన ఎన్నికల అధికారులు, జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈనెల 3, 4 తేదీల్లో నిర్వహించనున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో అర్హులందరూ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లా డారు. వయోజనుల వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి పోలింగ్ కేం ద్రంలో బూత్స్థాయి అధికారులు ఓటరు నమో దు, సవరణ సంబంధిత దరఖాస్తు ఫారాలతోపాటు జాబితాలో పేర్లు కలిగిన ఓటర్లు తమ వివరాలను పరిశీలన చేసుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటరు జాబితా అందుబాటులో ఉంచామని చెప్పారు.
గ్రామాల్లో మైకులు, సోషల్ మీడియా, దండోరా, దిన పత్రికలు, కేబుల్ చానళ్లు, ఇతర ప్రసార సాధనాల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ప్రధాన కూడళ్లు, జనసంచారం అధికంగా ఉన్న ప్రదేశాల్లో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ద్వారా ఓటరు నమోదు, జాబితా సవరణపై కళాజాత నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈనెల 3, 4 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
నూతనంగా ఓటరు పేరు నమోదు, మార్పులు, చేర్పులు, మరణించిన వారి వివరాల తొలగింపు, ఆధార్ కార్డు అనుసంధానం, జాబితా సవరణపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, ఆదిలాబాద్ ఆర్డీవో రాథోడ్ రమేశ్, బోథ్ ఈఆర్వో వెంకటేశ్వర్లు, ట్రైనీ సహాయ కలెక్టర్ శ్రీజ, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందా ప్రియ, స్వీప్ నోడల్ అధికారి లక్ష్మణ్ పాల్గొన్నారు.