నిర్మల్, జూలై 8(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) వింగ్ ఏర్పాటుతో జడ్పీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కల నెరవేరింది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్లో మాత్రమే ఉండగా.. చిన్న జిల్లాల అవతరణతో స్థానికంగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో నిర్మల్లోని జడ్పీ ఆఫీసులో జీపీఎఫ్ వింగ్ ఏర్పాటు చేశారు. ఇది ఉమ్మడి నాలుగు జిల్లాలతో లింకప్ ఉంటుంది. దీనిని గత బుధవారం అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డి సంఘ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఫలితంగా 1,583 మందికి ప్రయోజనం చేకూరనుంది. దూరభారం, వ్యయ ప్రయాసలు తగ్గడం, సమయం ఆదా అవుతుం డడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ జీపీఎఫ్ ఖాతాల వివరాలను ఎప్పటికప్పుడు చూసుకునేందుకు అనువుగా ప్రత్యేకంగా వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తెచ్చారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాలుగు జిల్లాలుగా విభజన జరిగిన తర్వాత జడ్పీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీపీఎఫ్(జనరల్ ప్రావిడెండ్ ఫండ్)కు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీపీఎఫ్ విభాగం కేవలం ఉమ్మడి జిల్లా కేంద్రంలోనే కొనసాగడంతో చెల్లింపులు, రుణాలు, పార్ట్ పేమెంట్ రుణాలు ఇతర పనుల కోసం ఆదిలాబాద్ వెళ్లాల్సి వచ్చేది. నిర్మల్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు జీపీఎఫ్ సమస్యను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి ఉన్నతాధికారులతో చర్చించడంతో జిల్లాకు కొత్త జీపీఎఫ్ విభాగం మంజూరైంది. రాష్ట్రంలోనే కొత్త జిల్లాల్లో మొట్ట మొదట నిర్మల్ జిల్లాకే ఈ అవకాశం దక్కింది. ఈ విభాగాన్ని నిర్మల్లోని జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఇటీవల మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డి, జడ్పీ సీఈవోపాటు వివిధ సంఘాల ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులు, పెన్షనర్ల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభించారు. నిర్మల్ జిల్లా ఏర్పడినప్పటికీ దాదాపు ఏడేళ్లుగా పంచాయతీరాజ్ ఉద్యోగులు జీపీఎఫ్ కార్యకలాపాల కోసం ఇబ్బందులకు గురవుతున్నారు. జీపీఎఫ్ విభాగం ఏర్పాటు ట్రెజరీ కార్యాలయాలతో ముడిపడి ఉన్న కారణంగా ప్రభుత్వం సాంకేతికపరమైన అవరోధాలను తొలగించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నది. ఈ చర్యల కారణంగానే జీపీఎఫ్ విభాగం ఏర్పాటు సాధ్యమైంది. జిల్లావ్యాప్తంగా జడ్పీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కలిపి మొత్తం 1,583 మంది జీపీఎఫ్ సభ్యులుగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ప్రస్తుత జీపీఎఫ్ విభాగానికి రూ.46.60 కోట్లు బదిలీ కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి రూ.14.60 కోట్లు జమయ్యాయి. దీని కారణంగా ప్రస్తుతం రూ.61.20 కోట్లు జీపీఎఫ్ విభాగంలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇకపై జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జీపీఎఫ్ విభాగం నుండే అన్ని రకాల చెల్లింపులు జరగనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ (https://epanchayat.telangana.gov.in/zpgpf/)తో కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ఖాతాదారులకు ప్రయోజనం
కొన్నేళ్ల నుంచి జీపీఎఫ్ ఖాతాదారులైన పంచాయతీరాజ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రుణాలు, ఇతర లావాదేవీల కోసం ఇబ్బందులకు గురయ్యారు. వీరు ప్రతి చిన్న విషయానికి ఆదిలాబాద్కు వెళ్లాల్సి వచ్చే ది. కొన్నిసార్లు అక్కడ పనికాక పోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చే ది. ముఖ్యంగా సాంకేతికపరమైన లోపాలు ఏర్పడినప్పుడు ఆదిలాబాద్ వెళ్లి ఖాళీగా తిరిగొచ్చిన సందర్భాలు ఉన్నాయి. స్థానికంగా వింగ్ లేకపోవడం వల్ల ఏవైనా ఫిర్యాదులు, అభ్యంతరాలు ఉన్నప్పుడు ఉద్యోగులు ఇక్కట్లకు గురయ్యేవారు. కాగా.. జిల్లాలో 1,583 మంది ఖాతాదారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో పంచాయతీ రాజ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మినిస్టీరియల్ సిబ్బంది ఉన్నారు. వీరందరికీ ఇక నుండి స్థానికంగా ఏర్పాటు చేసిన జీపీఎఫ్ విభాగం పరిధిలోనే అన్ని రకాల చెల్లింపులు జరుగనున్నాయి.
నాలుగు కార్యాలయాలకు అనుసంధానం..
నిర్మల్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జీపీఎఫ్ విభాగాన్ని జిల్లాలోని నాలుగు ట్రెజరీ కార్యాలయాలకు అనుసంధానం చేశారు. భైంసా, ముథోల్, నిర్మల్, ఖానాపూర్లలోని సబ్ ట్రెజరీ ఆఫీసులకు లింకప్ చేయడంతో పంచాయతీరాజ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన బిల్లులన్నీ ఇక్కడి నుంచే క్లియర్కానున్నాయి. ఇప్పటివరకు ప్రతి సబ్ ట్రెజరీ కార్యాలయం ఆదిలాబాద్ జీపీఎఫ్ వింగ్కు అనుసంధానం ఉన్న కారణంగా సాంకేతికపరమైన లోపాలతోపాటు పలు మార్లు క్షేత్రస్థాయిలో కూడా ఇబ్బందులు తలెత్తాయి. ఇక నుంచి నిర్మల్ జిల్లా కేంద్రంగానే జీపీఎఫ్ బిల్లులను క్లియర్ చేసేందుకు మార్గం సుగమమైంది.
జీపీఎఫ్ ఖాతా వివరాలకు ప్రత్యేక వెబ్సైట్
ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ జీపీఎఫ్ ఖాతాల వివరాలను ఎప్పటికప్పుడు చూసుకునేందుకు అనువుగా ప్రత్యేకంగా వెబ్సైట్ను (https://epanchayat. telangana. gov.in/zpgpf/) అందుబాటులోకి తెచ్చాం. నిర్మల్లో జీపీఎఫ్ విభాగం అందుబాటులోకి రావడం వల్ల ఈ ప్రాంత ఉద్యోగులకు ఎంతో అనువుగా ఉంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన సందర్భంలో పెన్షనర్లు తమ ఫైనల్ పేమెంట్ కోసం జీపీఎఫ్ కార్యాలయం చుట్టూ పలుమార్లు తిరగాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిర్మల్లోనే ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. ఉద్యోగులకు జీపీఎఫ్కు సంబంధించి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నిర్మల్లోని జీపీఎఫ్ విభాగంలో సిబ్బంది అందుబాటులో ఉంటారు. – సుధీర్, సీఈవో, జిల్లా ప్రజా పరిషత్, నిర్మల్
ఉద్యోగ, ఉపాధ్యాయులకు మేలు..
నిర్మల్లో జీపీఎఫ్ కార్యాల యం ఏర్పాటుతో ఉద్యో గ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు మేలు జరు గుతోంది. ముథోల్, భైంసా, ఖానాపూర్, కడెం, దస్తూరాబాద్ మండలాల నుండి ఆదిలాబాద్ 150కి.మీ ఉంటుంది. దీంతో ఉద్యోగులు అనేక ఇబ్బందు లు పడేవారు. స్థానికంగానే ఏర్పాటు చేయడం తో దూరభారం తగ్గింది. కొత్త జిల్లాలు ఏర్పాటుతోనే ఈ కార్యాలయం వచ్చింది.
– టీ.నరేంద్రబాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్.