నిర్మల్ జిల్లాలో వరి పంట కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వానకాలం సీజన్కు సంబంధించి 1,37,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం 199 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 12700 మంది నుంచి ధాన్యం సేకరించగా, 63096 మెట్రిక్ టన్నులు కేంద్రాలకు చేరుకుంది. ఇందులో 6 వేల మంది ఖాతాల్లో రూ. 62 కోట్లు చెల్లింపులు చేసింది. ఈ ఏడాది మద్దతు ధర క్వింటాలుకు రూ. 143 పెంచడంతో పాటు రైతాంగానికి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది. గన్నీ సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకుంది.
నిర్మల్, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ): జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వానకాలం సీజన్కు సంబంధించి వరిపంట కొనుగోళ్ల కోసం అధికారులు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా రైతులు 1,32,928 ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా, ఎకరానికి సగటున 18 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈ విధంగా మొత్తం 2,39,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ, పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. ఏటా వానకాలం సీజన్లో రైతులు ఎక్కువగా సన్నరకాలు వేస్తుంటారు. దీంతో స్థానిక అవసరాలు, సీడ్ కోసం దాదాపు లక్షా రెండు వేల మెట్రిక్ టన్నులు పోగా, మిగతా 1,37,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయనున్నది.
ఇందుకనుగుణంగానే జిల్లా వ్యాప్తంగా మొత్తం 221 వరి కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే చాలా చోట్ల వరికోతలు పూర్తి కావడంతో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్లతో పాటు సివిల్ సైప్లె అధికారులు ప్రతి రోజు ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తూ సంబంధిత అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపడుతూనే, అవకతవకలపై కూడా దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా తరుగు, తేమ విషయంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎక్కడ కూడా చిన్న ఆరోపణలు వచ్చినా వెంటనే స్పందిస్తున్న అధికారులు… అక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ఆయా మండలాల్లో వరి కోతలు ప్రారంభమైన ప్రాంతాల్లో 199 కేంద్రాలను ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు మొత్తం 12,700మంది రైతుల నుండి 63,096 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 61,127 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 6 వేల మంది రైతులకు రూ.61 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. మిగతా రైతులకు సంబంధించిన డబ్బులను దశల వారీగా చెల్లించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే వరిధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు తరలి వస్తుండడంతో అధికారులు నిలువ విషయంలో చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా గన్నీ సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించేందుకు రవాణా వ్యవస్థను పకడ్బందీగా చేపడుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 221 కేంద్రాల ఏర్పాటు…
కాగా వానకాలం సీజన్కు సంబంధించి వరి ధాన్యం కొనుగోళ్ల కోసం నిర్మల్ జిల్లాలో మొత్తం 221 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. వీటిలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే సెంటర్లు 36, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 99, డీసీఎమ్మెస్ ఆధ్వర్యంలో 81, జీసీసీ ఆధ్వర్యంలో 5 కేంద్రాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో వచ్చిన దిగుబడులను బట్టి ఇప్పటి వరకు 199 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి మిగతా సెంటర్లను కూడా ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. అలాగే కొనుగోలు సెంటర్లకు అవసరమైన సామగ్రిని మార్కెటింగ్ శాఖ అధికారులు పంపిణీ చేశారు.
ఇప్పటి వరకు 130 ప్యాడీ క్లీనర్లను అందజేయగా, అధనంగా మరో 95 ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడేందుకు గత రెండు సీజన్లలో 2500 టార్పాలిన్లను రైతులకు పంపిణీ చేశారు. ఇంకా మార్కెట్ కమిటీల్లో 1850 వరకు టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ధాన్యాన్ని తూకం వేసేందుకు 304 ఎలక్ట్రానిక్ కాంటాలను సిద్ధంగా ఉంచారు. తేమ శాతాన్ని గుర్తించేందుకు 250 మీటర్లను అందుబాటులో ఉంచామని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. అంతే కాకుండా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నారు.
20 లక్షల గన్నీ బ్యాగులు సిద్ధం..
వానకాలం ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలో 20 లక్షల సంచులు సిద్ధంగా ఉన్నాయి. మిగతా గన్నీ బ్యాగులను వివిధ రూపాల్లో సేకరించి కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మిల్లర్లతో పాటు, రేషన్ దుకాణాల నుంచి సంచులను తెప్పించారు. కాగా ఈ సారి ప్రభుత్వం వరి మద్దతు ధరను రూ.143 పెంచడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రేడ్-ఏ రకం క్వింటాలుకు రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183 మద్దతు ధర అందించనున్నది.
ఈ సారి సకాలంలో వర్షాలు కురియడంతో జిల్లా వ్యాప్తంగా వరిపంట ఆశాజనకంగా ఉంది. వరికోతలు ముందుగానే ప్రారంభం కావడంతో అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లు కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేసింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే రైస్ మిల్లులకు కస్టమ్ మిల్లింగ్ కోసం తరలిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఒక లారీకి సరిపడా ధాన్యం బస్తాల తూకం పూర్తయిన వెంటనే కస్టమ్ మిల్లింగ్ కోసం తరలిస్తున్నారు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేసి ధాన్యం విక్రయించిన రైతులకు వెంట వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు.
లక్షా 37వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం…
నిర్మల్ జిల్లాలో ఈ వానకాలం సీజన్కు గాను 1,37,000మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ప్రణాళిక రూపొందించాం. ఆయా శాఖల ద్వారా మొత్తం 221 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. ఇప్పటికే 199 సెంటర్లను ప్రారంభించాం. ప్రతి కేంద్రంలో ముందస్తుగానే సరిపడా గన్నీ సంచులు, ఇతర పరికరాలు ఉండేలా చర్యలు తీసుకున్నాం. అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వసతులు కల్పిస్తున్నాం. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు 24 గంటల్లోపు వారి ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కేంద్రాల నుంచి వెంటనే మిల్లులకు ధాన్యాన్ని తరలించేలా ఏర్పాట్లు చేశాం. ఇప్పటి వరకు 12,700 మంది రైతుల నుండి 63,096 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, రూ.62 కోట్ల చెల్లింపులు జరిపాం. త్వరలోనే మిగతా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం.
-కే.శ్రీకళ, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల శాఖ