బాన్సువాడ, జూలై 9 : పేద విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో నిర్వహణ అధ్వానంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అస్తవ్యస్తంగా మారాయి. దీంతో అందులో చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాణ్యమైన విద్య, భోజనం, మెరుగైన మౌలిక వసతులు ఉంటాయని భావించి, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు.
కానీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లపై ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారుల పర్యవేక్షణ కరువైంది. వసతి గృహ వార్డెన్లు కూడా తమకేమీ పట్టునట్లుగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది వార్డెన్లు కేవలం వారి వేతనాలు, లాభసాటి వ్యవహారాలపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై చూపడంలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తరచూ ఫుడ్ పాయిజన్, విద్యార్థుల బలవన్మరణాల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు వార్డెన్లకు రెండేసే, మూడేసి వసతిగృహాలకు ఇన్చార్జిగా నియమించడంతో వారు సక్రమంగా హాస్టల్స్కు రావడంలేదు. దీంతో విద్యార్థులను పట్టించుకోకపోవడంతో, ఉన్న సిబ్బందితో వసతి గృహాలను నడిపిస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఫుడ్ పాయిజన్..బలవన్మరణాల ఘటనపై ఆందోళన
బాన్సువాడ నియోజక వర్గంలోని ప్రభుత్వ వసతిగృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మూడు నెలలుగా ఏదో ఒకచోట విద్యార్థుల బలవనర్మరణాలు, ఫుడ్పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మూడు నెలల క్రితం బాన్సువాడ మండలంలోని బోర్లం రెసిడెన్షియల్ స్కూల్లో ఓ ఉపాధ్యాయురాలు తన ఇంటివద్ద శుభకార్యానికి పాఠశాల నుంచి బెంచీలు తీసుకెళ్లింది. ఫేర్వెల్ పార్టీ కోసం బెంచీలను పాఠశాలకు తిరిగి ఆటోలో తెస్తుండగా కిందపడి ఓ విద్యార్థిని మృతి చెందింది. ఇటీవల బీర్కూర్లోని మహాత్మా జ్యోతిబాపూలేపాఠశాలలో భోజనం వికటించి 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవగా, బాన్సువాడ దవాఖానకు తరలించారు.
ఈ ఘటన మరువకముందే బాన్సువాడలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ ఫస్టియర్లో అడ్మిషన్ పొందిన అమృత ( 17 ) బుధవారం ఎస్సీ వసతి గృహంలోని గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఇలాంటి ఘటనలతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అలసత్వం, వార్డెన్ల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల పట్టింపులేని తనంతో విద్యార్థులు బలవుతున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులు ఉంటున్న పాఠశాల, కళాశాల వసతిగృహాల్లో అనుభవం ఉన్న వార్డెన్లను నియమించాలని, వారం రోజులకోసారి జిల్లాస్థాయి అధికారులు సందర్శించాలని, ప్రజాప్రతినిధులు రాత్రి బస చేస్తే, వార్డెన్లు సక్రమంగా విధులు నిర్వర్తిస్తారని తల్లిదండ్రులు భావిస్తున్నారు.
ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహ వార్డెన్పై వేటు
బాన్సువాడ , జులై 9: బాన్సువాడ పట్టణం టీచర్స్ కాలనీలో ఉన్న ఎస్సీ బాలికల కశాశాల వసతి గృహ వార్డెన్పై అధికారులు వేటువేశారు. జిల్లా ఉన్నతాధికారి సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటేశ్ గురువారం తెలిపారు. హాస్టల్లో ఓ విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకున్న విష యం తెలిసిందే. బాలిక మృతికి వార్డెన్ కారణమని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
అధికారుల పర్యవేక్షణ లేదు..
రెండున్నరేండ్లుగా రా్రష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో బాన్సువాడ నియోజక వర్గంలో ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
-ఎర్రవట్టి సాయిబాబా, బీఆర్ఎస్వీ రాష్ట్ర మాజీ కార్యదర్శి
సెక్యూరిటీ గార్డులను నియమించాలి
వసతిగృహాల్లో సెక్యూరిటీ గార్డులను నియమించాలి. విద్యార్థుల్లో భయం పోగొట్టడానికి ప్రతినెలా వారి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలి. దీంతో విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ కరువైంది. అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు వసతిగృహాల్లో బస చేస్తే విద్యార్థుల ఇబ్బందులు తెలుస్తాయి. పోస్టుమెట్రిక్ సంక్షేమ వసతిగృహాలపై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
-విజయ్కుమార్, బీసీ విద్యార్థి సంఘం డివిజన్ అధ్యక్షుడు
వసతిగృహాల్లో తనిఖీలు ఎక్కడ?
బడుగు బలహీన వర్గాల పిల్లలు చదివే రెసిడెన్షియల్ పాఠశాలల్లో అధికారుల పర్యవేక్షణ కరువైంది. అసలు అటువైపు వెళ్లి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడంలేదు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిత్యం ఏదో ఒకచోట బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఒక్కో వార్డెన్ రెండు హాస్టళ్లకు ఇన్చార్జిగా ఉండడం విద్యార్థులకు శాపంగా మారింది. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో వార్డెన్లను నియమించాలి.
-అంజుం ఖలీల్, కౌన్సిలర్, బాన్సువాడ మున్సిపాలిటీ