కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ) : ఉపాధి హామీ కూలీలకు పనిచేసే ప్రదేశాల్లో కనీస వసతులు లేకపోవడంతో మండుతున్న ఎండలోనే పనులు చేస్తున్నారు. నీడ, తాగునీరు, ప్రాథమిక ఆరోగ్య కిట్లు అందుబాటులో ఉంచడం లేదు. ఇటీవల క్షేత్రాస్థాయిలో తనిఖీలు చేపట్టిన ఉన్నతాధికారులు పని ప్రదేశాల్లో కూలీలకు వసతులు కల్పించకపోవడంతో 12 మంది ఎంపీడీవోలకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు.
ప్రస్తుతం వ్యవసాయ పనులు ముగియడంతో కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు అవుతున్నాయి. కూలీలు ఎండలో సతమతమవుతూ పనులు చేస్తున్నారు. కూలీలు పనిచేస్తున్నప్పుడు కాలుపై గడ్డపార పడిన, ఏదైన క్రిమికీటకాలతో ఏదైనా ప్రమాదం సంభవించినా కూలీలకు చికిత్స చేయటానికి సౌకర్యాలను కల్పించడం లేదు. ముందస్తు చర్యల్లో భాగంగా కూలీలు డీ హైడ్రేషన్కు గురికాకుండా చర్యలు చేపట్టడం లేదు.
ఎండలు బాగా కొడుతున్నాయి. మేము పనులు చేసే దగ్గర నీడ లేదు. ఎండ లోనే పనులు చేస్తున్నాం. ఏదైనా దెబ్బ తగిలితే కూడా ఎవరూ పట్టించుకోరు. కనీసం పనులు చేసే దగ్గర కూలీల కోసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వడం లేదు. అధికారులు పనులు జరు గుతున్న ప్రదేశాల్లో కనీసం తాగునీరు, నీడ వసతి కల్పించాలి. ప్రస్తుతం వ్యవసాయ పనులు లేకపోవడంతో అందరం ఉపాధి పనులకే వస్తున్నాం. – భీమయ్య, ఉపాధి కూలీ, తుంపల్లి.
బయట కూలీ పనులు లేకపోవడంతో ఉపాధి పనులకు వస్తున్నాం. ఎండకాలంలో ఇంటిని గడుపుకునేందుకు కష్టమవుతోంది. అందుకనే ఈ ఉపాధి పనులకు వస్తున్నాం. పని చేసే చోట ఎంత కష్టమైనప్పటికీ తప్పని సరి పరిస్థితుల్లో పనులు చేస్తున్నాం. పనిచేసే చోట తాగేందుకు నీళ్లు లేకపోవడంతో మేము పనికి వచ్చేటప్పుడే ఇంటి నుంచి తెచ్చుకుంటున్నాం. నీళ్లు తెచ్చిన కొద్ది సేపటికే అవి అయిపోతున్నాయి. దాహాన్ని అపుకుని మరీ పనులు చేయాల్సి వస్తుంది. అధికారులు కనీసం తాగేందుకు నీైళ్లెనా ఇవ్వాలి.
– మల్లక్క, ఉపాధి కూలీ, తుంపల్లి.