కెరమెరి, ఏప్రిల్ 18 : మహారాష్ర్టలో శుక్రవారం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొదటి విడుతలో 19న మహారాష్ట్ర, వచ్చే నెల 13న తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే సరిహద్దు వివాదస్పద గ్రామాల్లోని ప్రజలకు తెలంగాణతోపాటు మహారాష్ట్రలోనూ ఓటు హక్కు ఉంది. ఎటూ వేసినా ఒకే సారి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై కలెక్టర్ ఆదేశాల మేరకు మండల అధికారులు సిబ్బందితో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించారు.
24 రోజుల వ్యవధిలో రెండు ప్రాంతంలో జరిగే ఎన్నికల్లో ఎంత మంది ఈమ ఓటు హక్కును ఎటు వైపు వినియోగించుకుంటారో చూడాలి. పరందోలి, తాండ, లేండిజాల, చింతగూడ, ముకదాంగూడ, మహారాజ్గూడ, బోలపటార్, గౌరి, లేండిగూడ, అంతాపూర్, ఏసాపూర్, నారాయణగూడ గ్రామాల్లో పురుషులు 1,763, మహిళలు 1,594 మొత్తం 3,357 మంది ఓటర్లు ఉన్నారు. వారి కోసం పరందోలి, ముకదాంగూడ, బోలపటార్, అంతాపూర్, గౌరి గ్రామాల్లో ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రెండు సార్లు ఓటింగ్కు అవకాశం ఇవ్వకుండా ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా ఎన్నికలు జరిగేలా అధికారులు సిద్ధమయ్యారు.