ఆసిఫాబాద్/హాజీపూర్, సెప్టెంబర్ 2 : జిల్లాలో అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం కలెక్టర్లు, నోడల్ అధికారులు, సంబంధిత అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004 జనవరి 1 నుంచి డిసెంబర్ 31వరకు జన్మించిన పిల్లల వివరాలను స్థానిక పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి సేకరించి వారిని నూతన ఓటరుగా నమోదు చేయడంతో పాటు గతేడాది మరణించిన వారి వివరాలను కూడా సేకరించాలని సూచించారు. జాబితాను బూత్ స్థాయి అధికారుల పరిధి నిర్దేశించి బాధ్యతలు అప్పగించాలన్నారు.
ఈ నెల 5 నుంచి 9 వరకు జిల్లాలోని స్వశక్తి మ హిళా సంఘాలతో బూత్ లెవెల్ స్థాయి అధికారులతో ఆధార్ లింకేజి మొదలగు అంశాలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సెప్టెంబర్11 నుంచి 16 వరకు డీఆర్డీవో, బూత్ లెవల్ అధికారులతో ఇంటింటి సర్వే నిర్వహించి జిల్లాలో ఉన్న గర్భిణులు, బాలింతలను ఓటరు జాబితాలో నమోదు చేయాలని, ఇందుకోసం అంగన్వాడీ టీచర్ల సహకారం తీసుకోవాలన్నారు. విద్యా సంస్థల్లో 18 సంవత్సరాలు నిండి ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలన్నారు. ఈ నెల 19 నుంచి 24 వరకు ప్రాథమిక , ఏరియా దవాఖానల్లో ఓటరు నమోదు , ఆధార్ లింకేజిపై అవగాహన కల్పించారు.
వ్యాపారులతో చర్చించి వారి సంస్థల్లో పని చేస్తున్న వారందిరికీ ఓటు హక్కు కల్పించాలని సూచించారు. జిల్లాలో ఉన్న దివ్యాంగుల జాబితా సదరం క్యాంపు నుంచి సేకరించాలన్నరు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే ఓటరు నమోదుకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అలాగే 18 ఏళ్లు నిండిన వారిని ఓటరుగా నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి మాట్లాడుతూ జిల్లాలో ఓటరు నమోదుతో పాటు మరణించిన వారి వివరాలను పూర్తి స్థాయిలో సేకరించి జాబితా సవరణ చేస్తున్నామని తెలిపారు.ఆయా కార్యక్రమాల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్బాయ్, ఆర్డీవో సిడాం దత్తు, డీపీవో రమేశ్, డీపీఆర్వో కృష్ణమూర్తి సంబంధిత అధికారులు , మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నా యక్, ట్రైనీ కలెక్టర్ గౌతమీ, బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవి, జి ల్లా పౌర సంబంధాల అధికారి వై సంపత్ కుమార్, ఎన్నికల డీ టీ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.