ఆసిఫాబాద్, డిసెంబర్ 2 : జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాహుల్ మహివాల్, సిర్పూర్ నియోజకవర్గ పరిశీలకుడు వరప్రసాద్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు దీపక్ తివారి, దాసరి వేణులతో కలిసి సూపర్వైజర్లు, సహాయకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌంటింగ్ నిర్వహణలో సూపర్వైజర్లు, కౌంటింగ్ సహాయకుల పాత్ర కీలకమైనదన్నారు. కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు తరలించే సమయంలో నిబంధనల ప్రకారం ఆయా సంబంధిత పోలింగ్ కేంద్రాలకు సంబంధించినవి మాత్రమే తరలించాలని, కౌంటింగ్ కోసం నియమించబడిన సిబ్బంది ఈ నెల 3న ఉదయం 6 గంటల లోగా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెకింపు, 8.30 గంటలకు ఈవీఎం లెకింపు ప్రారంభించాలని తెలిపారు.
అభ్యర్థులు సంబంధిత ఏజెంట్ల సమక్షంలో పూర్తి పారదర్శకంగా కౌంటింగ్ కార్యక్రమం జరుగుతుందని, ఎలాంటి పొరపాట్లు లేకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ కౌంటింగ్ నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ ఆర్డీవో సురేశ్, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ సహాయకులు పాల్గొన్నారు.