కుభీర్ : మద్యం తాగవద్దని భార్య, కుమారుడు కోరినందుకు ఓ వృద్దుడు ఆత్మహత్య ( Suicide ) చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సాంవ్లీ గ్రామంలో చోటుచేసుకుంది. కుబీర్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాలు ప్రకారం.. ఇంట్లో ఉంటున్న వృద్దుడు( Elderly Man ) పీరాజికి బుధవారం భార్య, కుమారుడు చేనుకు రమ్మని చెప్పి వెళ్లిపోయారు.
ఎంతసేపటికి చేనుకు రాకపోవడంతో తల్లి, కుమారుడు మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నారు. పీరాజి ఇంటికి రాకపోవడంతో గ్రామంలో ఆరా తీశారు. చీకటి పడిన ఇంటికి రాకపోవడంతో శివారు ప్రాంతమంతా గాలించారు. గురువారం గ్రామ సమీపంలోని సుద్ద వాగు బ్రిడ్జి వద్ద పీరాజికి చెందిన బట్టలు, చెప్పులు కనిపించినప్పటికీ ఆయన జాడ దొరకలేదు.
విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో వెతికించగా మృతదేహాం లభ్యమైంది . కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతుడు పీరాజి గత కొంతకాలంగా తాగుడికి బానిసై , జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.