కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : మంచిర్యాల-చంద్రాపూర్ వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులతో పులులు, ఇతర వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్ర అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. అటవీజంతువులు తరచూ రోడ్డు దాటే ప్రాం తాలను గుర్తించి.. ఆయా ప్రదేశాల్లో పర్యావరణ వంతెనలను శరవేగంగా నిర్మిస్తున్నది.
మంచిర్యాల నుంచి చంద్రాపూర్ వరకు ఉన్న జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నారు. ఈ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ రోడ్డు విస్తరణ కారణంగా చంద్రాపూర్లోని తడోబా-అంథేరి టైగర్స్ సంరక్షణ ప్రాంతాల నుంచి వచ్చే పులులు స్వేచ్ఛగా తిరగలేక పోతాయంటూ కొన్ని రోజుల క్రితం తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర సర్కారుకు లేఖలు రాశాయి. ఈ విషయమై నేషనల్ హైవే అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూల్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఓ నిర్ణయానికి వచ్చాయి. పులుల సంరక్షణలో భాగంగా పర్యావరణ వంతెనలు నిర్మించాలని నిర్ణయించాయి.
వాంకిడి-మహారాష్ట్ర సరిహద్దుల్లో, రెబ్బెన వద్ద రూ. 30 కోట్లతో ఎకో వంతెనల నిర్మాణం శరవేగంగా చేపడుతున్నారు. ఆయాచోట్ల సుమారు కిలో మీటరు మేర వంతెనలు నిర్మిస్తున్నారు. దాదాపు 150 మీటర్ల పొడవుతో వీటిని నిర్మిస్తున్నారు. వంతెన కింది నుంచి నాలుగు వరుసల రహదారిపై వాహనాల రాకపోకలు సాగనుండగా, పై నుంచి అడవి జంతువులు సంచరించేందుకు వీలుగా నిర్మాణం చేపడుతున్నారు. నాలుగు వరుసల రహదారికిరువైపులా కొండలను ఆనుకొని ఎత్తైన వాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వంతెనపై గటేర్ల ద్వారా స్లాబ్ వేస్తారు. ఎకో వంతెనపై అడవిని తలపించేలా చెట్లు, పొదలు పెంచనున్నారు. ఈ ఎకో బ్రిడ్జిల ఏర్పాటుతో కింది నుంచి వాహనాల రాకపోకలు సాగనుండగా, పై నుంచి వెళ్లే సంచరించే జంతువులకు అడవిలోనే ఉన్న భావన కలగనున్నది.
పులులు, ఇతర వన్యప్రాణుల సంచారానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా పర్యావరణ వంతెనలను ఏర్పాటు చేస్తారు. వంతెనపై సహజమైన అడవిని తలపించేలా చెట్లు, పొదలను పెంచేందుకు అనువుగా నిర్మాణాలుంటాయి. మహారాష్ట్రలోని పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్ గుండా వెళ్తున్న జాతీయ రహదారి-44లో సుమారు 16 కిలోమీటర్ల వరకు పర్యావరణ హైలెవెల్ వంతెన నిర్మించారు.
అడవులకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ వంతెన కింది నుంచి అడవి జంతువులు, పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు అనువైన వాతారణం కల్పించారు. ప్రస్తుతం మహారాష్ట్ర -తెలంగాణ సరిహద్దుల్లోని వాంకిడి సరిహద్దు వద్దవద్ద నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణం వలన పులులు, ఇతర అటవీ జంతువుల సంచారానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా పర్యావరణ వంతెనలు(ఏకో బ్రిడ్జిలు) నిర్మాణం జరుగుతోంది.