సమైక్య రాష్ట్రంలో సమస్యలతో కొట్టుమిట్టాడిన చిట్యాల గ్రామం.. స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించగా, అనేక పనులు పూర్తి చేసుకొని ఆదర్శంగా నిలుస్తున్నది. ఎటు చూసినా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ దీపాలు, డంప్యార్డు, వైకుంఠధామం, రైతువేదిక, కమ్యూనిటీ హాళ్ల.. వంటి నిర్మాణాలతో పట్టణాలను తలదన్నేలా కనిపిస్తున్నది. మిషన్ కాకతీయ కింద చెరువులను ఆధునీకరించడమేకాకుండా స్వర్ణ వాగుపై చెక్డ్యాం నిర్మించడంతో చివరి ఆయకట్టుకూ సాగునీరందుతున్నది. ఇంటింటికీ మిషన్ భగీరథ జలం అందుతుండగా, దశాబ్దాల తాగు నీటి గోస తీరింది. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ఆ ఊరు.. నేడు బీఆర్ఎస్ సర్కారు అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందుకొని మురిసిపోతున్నది.
నిర్మల్, జూలై 7(నమస్తే తెలంగాణ) : తొమ్మిదేళ్ల క్రితం వరకూ ఆ పల్లె అనాథలా కనిపించింది. గ్రామస్తులు సమస్యల పరిష్కారానికి అనేకసార్లు ఉద్యమించినప్పటికీ అప్పటి పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆ ఊరు ఊరంతా కదం తొక్కింది. సీఎం కేసీఆర్ చేపట్టిన ఉద్యమానికి బాసటగా నిలిచింది. దీక్షలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొని తమ ఆకాంక్షను వెలిబుచ్చింది. ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి తెలంగాణ సాధన కోసం దీక్షలు చేపట్టింది. నాడు.. సౌకర్యాలు లేక కొట్టుమిట్టాడిన చిట్యాల.. స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకెళ్తూ రోల్ మాడల్గా నిలుస్తున్నది.
నిర్మల్ మండలం చిట్యాల గ్రామం ప్రస్తుతం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. ఈ గ్రామ జనాభా దాదాపు 2 వేలు కాగా, 500 కుటుంబాలు ఉన్నాయి. కాగా.. గత పాలకులు కేవలం పట్టణాలకే నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తున్నామంటూ ప్రకటనలు చేయగా, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం పట్టణాలకు ఏమాత్రం తీసిపోకుండా కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ పల్లెలను ప్రగతి వైపు నడిపిస్తున్నది. ఇందులో భాగంగానే ఈ తొమ్మిదేళ్లలో చిట్యాలలో రూ.20 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ నిధులతో గ్రామంలోని ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రధాన రోడ్డుతో పాటు వీధి వీధినా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఊరు పక్కనే గోదావరికి ఉపనదిగా పిలుచుకునే స్వర్ణ వాగు ప్రవహిస్తున్నప్పటికీ అప్పట్లో ఆ ఊరికి సాగు, తాగునీరు అందని దయనీయ పరిస్థితులు ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కింద ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నది. మిషన్ కాకతీయ కింద గ్రామంలోని చింతల చెరువు, పెద్ద చెరువులను ఆధునీకరించడమే కాకుండా రూ.4.50 కోట్లతో స్వర్ణ వాగు మధ్య చెక్డ్యాం నిర్మించింది. దీని ద్వారా గ్రామంలోని ప్రతి చివరి ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. దీంతో గ్రామం పాడి పంటలకు నెలవుగా మారింది. మన ఊరు-మన బడి పథకం కింద ఇక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. ప్రస్తుతం గ్రామంలో ప్రతి గల్లీకి సీసీ రోడ్లను నిర్మించడంతో స్థానికులకు ఎంతో సౌకర్యంగా మారింది. కాగా.. చిట్యాల గ్రామాన్ని ఇరుగు పొరుగు గ్రామాలతో అనుసంధానం చేసిన కారణంగా ఈ గ్రామానికి రవాణా సౌకర్యం విస్తరించింది. చిట్యాల నుంచి తాంశ, ముజ్గి తదితర గ్రామాలకు వెళ్లేందుకు గతంలో ప్రజలు అనేక ఇక్కట్లకు గురయ్యేవారు. అయితే ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం రూ.1.75 కోట్లతో వంతెన నిర్మించడంతో పాటు కొత్తరోడ్డు వేయడంతో పరిష్కారం లభించింది. గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించిన ప్రభుత్వం రూ.4.50 కోట్లతో 90 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి అందించింది. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామానికి ఓ ట్రాక్టరును అందజేయడంతో చెత్త సేకరణ, పారిశుధ్య సమస్య తొలగిపోయింది. అలాగే డంప్యార్డు, వైకుంఠధామం, రైతువేదిక, కమ్యూనిటీ హాళ్లు నిర్మించారు. దీంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్ పథకం ద్వారా 510 కుటుంబాలకు పింఛన్ సౌకర్యం అందుతున్నది.
ప్రభుత్వం కోట్లాది రూపాయల కేటాయించడం వల్లే మా ఊరు ఇంతటి పురోభివృద్ధి సాధించింది. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, జిల్లా ఉన్నతాధికారుల సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాబోయే రోజుల్లో మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తాం.
– పడకంటి రమేశ్రెడ్డి, సర్పంచ్, చిట్యాల గ్రామం.