భైంసా, జూలై 11 : డాక్టర్లు 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లా భైంసాలోని ప్రభుత్వ ఏరియా దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్ను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానకాలం సీజన్ ప్రారంభమైనందున డెంగీ నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లో ప్రతి మంగళవారం మహిళలకు 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే మాంజ్రి సమీపంలోని నర్సరీని పరిశీలించారు. మొత్తం మొక్కలు ఎన్ని ఉన్నాయని అధికారులను లెక్కపెట్టమన్నారు. తక్కువ మొక్కలు ఉండడంతో నర్సరీ నిర్వహించిన వారికి షోకాజు నోటీసులు జారీ చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట మున్సిపల్ డీఈ నాగేశ్వర్ రావు, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఏఈ యాకుబ్ అలీ, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్, డీఎంహెచ్వో ధన్రాజ్, డిప్యూటీ డీఎంహెచ్వో ఇద్రిజ్, డాక్టర్ అనిల్, ఆర్ఐ జైరావు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టాలి
ముథోల్, జూలై 11 : పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టాలని కలెక్టర్ వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముథోల్ మండలం కారేగాం, ఎడ్బిడ్, విఠోలితాండా, రువ్వి గ్రామాల్లో ఆయన పర్యటించారు. పల్లె ప్రకృతి వనాలు, డ్రై డేకు సంబంధించిన పనులను పరిశీలించారు. మురుగు కాలువల్లో పూడికతీత తీయించాలని, నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్ బాల్స్ వేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని అధికారులను ఆదేశించారు. రువ్విలో పని తీరు సక్రమంగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీడీవో సురేశ్బాబు, సర్పంచ్లు, ఎస్ఐ సాయికృష్ణ ఉన్నారు.
బాసర, జూలై 11: పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ వరుణ్రెడ్డి అన్నారు. బాసరతో పాటు పటు గ్రామాల్లో ఆయన పర్యటించారు. వానకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధులపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని, చెత్తాచెదారం, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హారితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. ఆయన వెంట అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది ఉన్నారు.
ఎంసీహెచ్ తనిఖీ
నిర్మల్ చైన్గేట్, జూలై 11: నిర్మల్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ వరుణ్రెడ్డి తనిఖీ చేశారు. దవాఖానలోని గదులను పరిశీలించారు. సాధారణ ప్రసవాలు పెంచేందుకు కృషి చేయాలన్నారు. నూతనంగా నియమితులైన డైస్ సిబ్బందితో మాట్లాడారు. సాధారణ ప్రసవాలపై ఏఎన్ఎంలకు శిక్షణ కల్పించాలన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ దేవేందర్రెడ్డి, ఇన్ఛార్జి డాక్టర్ రజని, డాక్టర్లు సుజనిత, నర్సింగ్ ఆఫీసర్లు హేమలత, అన్నపూర్ణ, కిరణ్మయి, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.