మంచిర్యాల ఏసీసీ, జనవరి 4 : పొగాకుతో కలిగే నష్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డా.జీ.సుబ్బారాయుడు అధికారులకు సూచించారు. గురువారం మంచిర్యాల కలెక్టరేట్లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో పొగాకు అవగాహన పోస్టర్లను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు పొగాకుకు బానిస అయి భవిష్యత్ను నాశనం చేసుకోవద్దన్నారు.
ఏవైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్ 14416లో సంప్రదించాలని సూచించారు. పొగాకు వల్ల కలిగే అనర్థాలపై పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో డా.విజయ పూర్ణిమ, పీవో డా.అనిత, డీఎస్వో డా.ఫాయాజ్, సూపరింటెండెంట్ విశ్వేశ్వరరెడ్డి, సీహెచ్వో లింగారెడ్డి, డెమో వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
మందమర్రి, జనవరి 4 : ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు పేర్కొన్నారు. మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడా రు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని సేవలు అందుతున్నాయని, నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గర్భిణులకు ప్రతి నెలా పరీక్షలు చేసి పోషకాహారాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. గర్భిణులు, చిన్న పిల్లలపై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, కుటుంబ నియంత్రణపై ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ పయాజ్ ఖాన్, మండల వైద్యాధికారి డాక్టర్ రమేశ్, సీహెచ్వో గంగాధర్, ఎంఎల్పీలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.