నిర్మల్ అర్బన్, మే 22 : విద్యార్థుల ఎదుగుదలకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సీఎం కప్ క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాల్సిన అవసరముందన్నారు. మండల స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు నేడు జిల్లా స్థాయిలో పాల్గొన్నారని, ఇక్కడ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఎంపికవుతారని తెలిపారు.
రాష్ట్రస్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఇప్పటికే జిల్లాలోని 120 వేసవి శిక్షణ శిబిరాల్లో విద్యార్థులు ఆసక్తి ఉన్న క్రీడలు నేర్చుకుంటున్నారన్నారు. ఆ తర్వాత సరదాగా ఆటలు ఆడారు. కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్కుమార్, అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, డీఈవో డాక్టర్ రవీందర్ రెడ్డి, జిల్లా క్రీడల అధికారి క్రాంతికుమార్, నాయకులు తదితరులున్నారు.