ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, డిసెంబర్ 1 :జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ నెల 3న నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాహుల్ మహివాల్, 001-సిర్పూర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, 005-ఆసిఫాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణులతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులతో సమీక్ష నిర్వహించి ఎన్నికలపై అభ్యంతరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గంలోని 55, 56, 75, 90 పోలింగ్ కేంద్రాలపై వచ్చిన ఫిర్యాదులను 17 ఏ, ప్రొసైడింగ్ అధికారి డెయిరీని ప్రతినిధుల సమక్షంలో పరిశీలించి జిల్లాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈనెల 3న జరుగనున్న కౌంటింగ్ కోసం అభ్యర్థులు తమ తరపున పాల్గొని కౌంటింగ్ ఏజెంట్లకు ఫారం 18 సమర్పిస్తే రిటర్నింగ్ అధికారుల ద్వారా అనుమతులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.