ఎదులాపురం, నవంబర్ 4 : ఆదిలాబాద్, బోథ్ శాసన సభ నియోజకవర్గాలకు రెండో రోజు శనివారం నామపత్రాలు దాఖలు కాలేదని జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం సెలవు అయినందున నామినేషన్లు స్వీకరించబడవని తెలిపారు. ఈ నామినేషన్ ప్రక్రియలో 007 ఆదిలాబాద్ ,008 బోథ్ రిటర్నింగ్ అధికారులు బీ స్రవంతి, చాహత్ బాజ్పాయ్, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బోథ్, నవంబర్ 4: బోథ్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన రెండో రోజు శనివారం ఒక్క నామినేషన్ కూడా రాలేదని రిటర్నింగ్ అధికారి చాహత్ భాజపాయ్ తెలిపారు. కొంత మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
నిర్మల్ టౌన్, నవంబర్ 4 : నిర్మల్ నియోజకవర్గ స్థానానికి రెండో రోజూ శనివారం ఒక్క నామినేషన్ కూడ దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రత్నకల్యాణి తెలిపారు. మొదటిరోజు 3 నామినేషన్లు దాఖలు కాగా, రెండోరోజు నామినేషన్లకు ఆర్డీవో కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తును పెంచి నిబంధనలు మరింత కఠినతరం చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఆదివారం ఎన్నికల నామినేషన్కు సెలవు కావడంతో సోమవారం నామినేషన్ల ప్రక్రియ వేగం కానున్నట్లు తెలిపారు.
జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించిన అన్ని సమాచారాలను అందించేందుకు కంట్రోల్రూంను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రత్నకల్యాణి తెలిపారు. ఈ నెల 3వ తేదీన నామినేషన్లతో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ వచ్చే నెల 3న కౌంటింగ్తో పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ కంట్రోల్రూం పని చేస్తోందన్నారు. 24 గంటల పాటు పని చేసే ఈ కంట్రోల్రూం సెల్ ఫోన్ నంబర్ 7661096808ను కేటాయించామన్నారు.
ముథోల్, నవంబర్ 4 : ముథోల్ ఆర్వో కార్యాలయంలో రెండో రోజు అభ్యర్థులెవరు నామినేషన్లు వేయలేదని రిటర్నింగ్ అధికారి కోమల్ రెడ్డి తెలిపారు. రిటర్నింగ్ కార్యాలయం ముందు బీఎస్ఎఫ్ బలగాలు బందోబస్తును ఏర్పాటు చేశారు.
రెండో రోజు ఉట్నూర్లో ఒకటి..
ఉట్నూర్, నవంబర్ 3: ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో శనివారం రెండో నామినేషన్ దాఖలైంది. బీజేపీ అభ్యర్థి రాథోడ్ రమేశ్ ఉట్నూర్ ఆర్డీవో జీవాకర్రెడ్డికి తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు.