మంచిర్యాల అర్బన్, జనవరి 22 : జిల్లా వ్యవసాయశాఖ అధికారి కార్యాలయం అక్రమాలకు కేరాఫ్ మారింది. డబ్బులివ్వనిదే ఇక్కడ ఏ పని జరగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎరువులు, విత్తనాల అలాట్మెంట్.. ఇలా ఏది కావాలన్నా.. చేయి తడపాల్సి వస్తున్నట్లు తెలుస్తున్నది.
చివరకు సెలవులు కావాలన్నా కాసులివ్వాల్సి వస్తుందంటూ ఆ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులే చెబుతుండడం విమర్శలకు తావిస్తున్నది. సిబ్బందిని కంట్రోల్లో ఉంచాల్సిన జిల్లా స్థాయి అధికారి సైతం ఇష్టం వచ్చినట్లు విధులకు డుమ్మాలు కొడుతుండగా, ఇక ఆయా సెక్షన్లు చూసే ఉద్యోగులు ఆడిందే ఆట,.. పాడిందే పాటగా మారింది.
జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏఈవోలకు సం బంధించిన సెక్షన్ అధికారి వ్యవహారంతో క్షేత్ర స్థాయి సహాయకులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ఏఈవోలకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఫైళ్లు పంపాలన్నా, సరెండర్ లీవు, మెడికల్ లీవు, మెడికల్ బిల్లు చేయాలన్నా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు.
లంచాలిస్తే.. ఏ అధికారి ఎక్కడికైనా బదిలీపై వెళ్లే వెసులు బాటు కల్పిస్తున్నట్లు తెలుస్తున్నది. ఔట్ సోర్సింగ్ ఏఈవోలకు, ఏఈవోలకు, ఏవోలకు.. డిప్యూటేషన్లు కావాలంటే కాసులిస్తే సరిపోతుందట. ఇటీవల బెల్లంపల్లి ఏవోను అక్కడి ఏడీఏ సురేఖ సరెండర్ చేస్తే.. ఉన్నతాధికారులు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా ఆయనకు నెన్నెలలో పోస్టింగ్ ఇచ్చి డబ్బులు దండుకున్నట్లు తెలిసింది. అలాగే ఎస్టీఎల్లో ఏవోగా విధులు నిర్వహించే మరొకరికి మందమర్రిలో పోస్టింగ్ ఇవ్వగా, అక్కడ డ్యూటీ సరిగా చేయడం లేదంటూ మంచిర్యాల ఏడీఏ సరెండర్ చేశారు.
ఆయనను ఏడీఏ ఆఫీసులో పీఏగా పెట్టుకుచ్చారు. కానీ ఆయన కార్యాలయంలో ఏ ఒక్కరోజూ కనిపించిన దాఖలాలు లేవు. ఖాళీగా ఉన్న ఏవో పోస్టు ఇవ్వకుండా ఆఫీసులో సీటు కేటాయించి పెట్టుకోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు గతంలో జిల్లా కార్యాలయంలో ఇన్చార్జి టెక్నికల్ ఏడీఏ(బెల్లంపల్లి ఏడీఏ)గా పని చేసిన సురేఖను ఇక్కడి నుంచి పంపించడం వెనుక ఆంతర్యమేమిటోనని అధికారులే గుసగుసలాడుకోవడం గమనార్హం.
జిల్లా వ్యవసాయాధికారి గత నెల 11వ తేదీ నుంచి సెలవులో ఉండగా, ఆ నెలకు సంబంధించి మొత్తం జీతం తన అకౌంట్లో జమ అయ్యింది. ఈ నెల 3న మరోసారి లీవు కావాలని కోరగా, ఒకటవ తేదీ నుంచి 10వ తేదీ వరకు కమిషనరేట్ మంజూరు చేసింది. అలాగే చెన్నూర్ ఏడీఏకు ఇన్చార్జి డీఏవోగా బాధ్యతలిస్తూ ఆదేశాలు అందాయి. ఇక డీఏవో తిరిగి ఈ నెల 11వ తేదీ నుంచి విధుల్లో చేరినట్లు హైదరాబాద్ నుంచి జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. అయితే జిల్లా కార్యాలయానికి మాత్రం ఈ నెల 22న వచ్చారు.
ఈ పది రోజులు తన సెల్ స్విచ్చాఫ్ ఉంది. అయితే కార్యాలయానికి రాకుండానే వచ్చినట్లుగా జీతం తీసుకోగా, అధికారి క్రాప్ బుకింగ్ చూస్తే అసలు విషయం బయటకు వస్తుందని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు కార్యాలయ సూపరింటెండెంట్ సైతం వారానికి ఒకటీరెండు రోజులే వస్తుండడం, కొందరు ఏడీఏలు కార్యాలయాలకు పోకుండానే నెల జీతం మొత్తం లేపుతున్నారనే ఆరోపణలున్నాయి. కాగా, ఈ విషయమై డీఏవోను వివరణ కోరగా, మాట దాటవేయడం కొసమెరుపు.