ఎదులాపురం, ఏప్రిల్ 15: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుల గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. రెండో విడుత గొర్రెల పంపిణీపై ఆదిలాబాద్లోని జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో శనివారం గొల్ల, కుర్మ సహకార సొసైటీల సభ్యులకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. సంక్షేమ పథకాలను గొల్ల కుర్మలు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. జిల్లాలో మొదటి విడుతలో 5022 గొర్రెలు పంపిణీ చేశామని చెప్పారు. రెండో విడుతలో 3638 గొర్రెల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారిని ఆదేశించారు. ఇప్పటి వరకు డీడీలు చెల్లించిన వారిలో ఎవరైనా మరణించినైట్లెతే వారి నామినీలకు యూనిట్లు అందజేస్తామని చెప్పారు. రెండో విడుతలో మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో గొర్రెలు కొనుగోలు చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర స్థాయి అధికారులు ఈ కొనుగోలు ప్రక్రియను పరిశీలిస్తారన్నారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ అధికారి కిషన్, ఏడీ రామారావు, సొసైటీ సభ్యులు రఘువీర్, హన్మాండ్లు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎంసెట్ శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందాలని కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. జిల్లా కేంద్రంలోని కొలాం బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎంసెట్ శిక్షణ తరగతులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన 100 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఉచిత ఎంసెట్ శిక్షణతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. మే 8 వరకు శిక్షణ తరగతులు ఉంటాయని వివరించారు. ఈ సందర్భంగా పరీక్ష రాసే విధానంపై సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పీ శ్రీజ, డీఐఈవో పర్యవేక్షకుడు మోసిన్, ఫ్యాకల్టీ సృజన్, మహేశ్ కుమార్, ప్రియాంక, రవీందర్, విద్యార్థులు పాల్గొన్నారు.