ఇచ్చోడ(సిరికొండ), జూలై 8: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పోడు భూముల పట్టాల కల సాకారం చేసి సీఎం కేసీఆర్ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా సిరికొండలోని రైతు వేదికలో తొమ్మిది గ్రామాలకు సంబంధించిన 556 మంది గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోడు భూముల పట్టాలు అందుకున్న గిరిజన రైతులకు రైతుబంధు, త్రీఫేజ్ విద్యుత్ అందిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదివాసుల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని తెలిపారు. కేసీఆర్ లాంటి సీఎం ఇప్పటి వరకు చూడలేదని పేర్కొన్నారు. మళ్లీ కేసీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించినప్పుడే ఆయన రుణం తీర్చుకుంటామని తెలిపారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
సిరికొండలోని రైతు వేదికలో ఎమ్మెల్యే రేఖానాయక్ సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పెందూర్ అమృత్రావ్, ఎంపీడీవో సురేశ్, పోచంపల్లి, రిమ్మ, లక్ష్మింపూర్ సర్పంచ్లు జయశ్రీ, అనిల్, నర్మదా, వాయిపేట ఎంపీటీసీ మారుతి, బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ బిక్కునాయక్, బషీర్, బాలాజీ, సునీల్, తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం
పల్లెల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేశారని, స్వరాష్ట్ర సాధన అనంతరం సమస్యలు లేని పల్లెలుగా తీర్చిదిద్దిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. పల్లెపల్లెకూ రేఖక్క కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పాండవపూర్ గ్రామంలో ఆమె పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు పనులు చేయకపోతే సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పిన్నం మల్లవ్వ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు నల్ల జీవన్రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు రఫీక్ హైమద్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు గోళ్ల వేణుగోపాల్, నాయకులు మల్లేశ్, గంగన్న, సురేందర్, లక్ష్మణ్, రాజేశ్, హాసీబ్, రాముగౌడ్, సత్తన్న, కట్ల శ్రీనివాస్, జనార్దన్, భీమన్న కాలనీవాసులు ఉన్నారు.