జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కుమ్రం భీం స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ కేంద్రంగా ఐటీడీఏ పరిధిలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల ఆదివాసులకు మంగళవారం పోడు పట్టాలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పోడు పట్టాదారులందరికీ పెట్టుబడి సాయం కింద రైతుబంధు అందజేస్తామని తెలిపారు. కొత్త అడవుల నరికివేతకు దూరంగా ఉండాలని కోరారు. సకాలంలో వర్షాలు కురియగానే మొక్కలు నాటడం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. గిరిజన గ్రామాలనుపంచాయతీలుగా మార్చి ‘మావ నాటే- మావ రాజ్’ పాలన సాగిస్తున్నామన్నారు.
– ఉట్నూర్, జూలై 4
ఉట్నూర్, జూలై 4 ః కుమ్రం భీంను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నదని, సీఎం కేసీఆర్ నాలుగు దశాబ్దాల కల నెరవేర్చారని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఉద్ఘాటించారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాలకు చెందిన గిరిజనులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు. అంతకుముందు స్థానికంగా కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గంలో 3,326 మందికి 10,843 ఎకరాలు, ఆదిలాబాద్ నియోజకవర్గంలో 2,207 మందికి 4 వేల ఎకరాలు, ఆసిఫాబాద్ నియోజకవర్గానికి 2,447 మందికి 6,867, బోథ్ నియోజకవర్గానికి 4,242 మందికి 9,956 ఎకరాలు మొత్తం 12,222 మందికి 31,683 ఎకరాల భూమిని పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇప్పటి నుంచే నేరుగా గిరిజన రైతుల ఖాతాలో రైతుబంధు డబ్బులు కూడా పడుతాయన్నారు. హక్కు పత్రాల అందజేతతో రైతులు ఎవరికీ భయపడకుండా వ్యవసాయం చేసుకోవచ్చన్నారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా చేస్తున్న కేసీఆర్ వెంట మనందరం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. భీం పేరిట ఆసిఫాబాద్ను జిల్లాగా మార్చాడని గుర్తు చేశారు. హట్టి నుంచి జోడేఘాట్ వరకు రూ.15 కోట్లతో బీటీ రోడ్డు ఏర్పాటు చేసి యేటా భీంకు ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. గిరిజన గ్రామాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ‘మావ నాటే-మావ రాజ్’ పాలన చేయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్, ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు, రాష్ట్ర మహిళా సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, బోథ్ ఎమ్మెల్యే బాపురావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, డీడీ దిలీప్ కుమార్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాం, ఎంపీపీ జైవంత్రావు, బీఆర్ఎస్ నాయకులు రమేశ్ పాల్గొన్నారు.
అడవులను నరకొద్దు..
గిరిజనులు ఇప్పటివరకు సాగు చేసుకుంటున్న భూములకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇచ్చినందున కొత్త అడవుల నరికివేతకు దూరంగా ఉండాలని మంత్రి కోరారు. అటవీ హక్కు పత్రాలు ఉన్న భూముల జోలికి అటవీ శాఖ అధికారులు రారన్నారు. అడవుల వల్ల మనకు సకాలంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. వర్షాలు కురియగానే ఈ యేడాది 20 కోట్ల మొక్కలు పెంపకం చేపడతామన్నారు. అటవీ భూముల కోసం ఉద్యమాలు చేసినప్పటికీ, కేసులన్నింటిని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రిజర్వేషన్లు పెంచి గిరిజనుల ఆత్మగౌరవం కాపాడారన్నారు. ఏజెన్సీలో త్రీఫేజ్ విద్యుత్, తాగు నీరు, విద్య, వైద్యంలో అనేక మార్పులు చేశారన్నారు. చిన్న గ్రామాలతోనే అభివృద్ధి సాధ్యమని భావించి సీఎం 500 జనాభా గల గ్రామాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. స్వరాష్ట్రంలో రూ.25 కోట్లతో మ్యూజియం కట్టుకొని యేటా నివాళులు అర్పిస్తున్నామన్నారు.
600 అనుబంధ గ్రామాలకు త్రీఫేజ్ కరెంటు
గిరిజనుల హక్కు కోసం పోరాడిన వీరుడు కుమ్రం భీం స్ఫూర్తిని ప్రభుత్వం కొనసాగిస్తోందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పోడు భూముల పట్టాల పంపిణీలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా గిరిజనుల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. పోడు భూముల పత్రాలు అందుకున్న వారికి త్వరలోనే రైతుబంధు ఖాతాల్లో జమచేయనున్నట్లు తెలిపారు. అలాగే 600 అనుబంధ గ్రామాలకు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.