నిర్మల్ అర్బన్, నవంబర్ 27 : ప్రజల సహ కారంతో నిర్మల్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఈద్గాం నుంచి కౌట్ల (కే) వరకు చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నిర్మల్ జిల్లా అన్ని రంగాల్లో సత్వరం అభివృద్ధి సాధిస్తూ ముందుకెళ్తున్నదని చెప్పారు.
రోడ్డు మరమ్మ తు చేసే సమయంలో ఇరువైపులా కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అదే సమయంలో మిషన్ భగీరథ పైప్లైన్ కోసం తవ్వకాలు ప్రారంభించి పది రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఆదర్శనగర్ లెప్ట్ పోచంపాడ్ వరకు రోడ్డు వేయడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని తెలిపారు. స్వర్ణ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 6.50 కోట్లు మంజూరు కాగానే పనులను ప్రారంభిస్తామని చెప్పారు.
పట్టణంలోని సిద్ధాపూర్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, అధికారులు కలిసి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ డబుల్బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. సిద్ధాపూర్లో 600 ఇళ్లు నిర్మిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఏస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ఉంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని తిరుమల గార్డెన్లో నిర్వహించిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. టీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడిగా మారుగొండ రాము ఎన్నిక కాగా ఆయనను సన్మానించారు.
సారంగాపూర్, నవంబర్ 27: పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని మల్లక్చించోలిలోని ఫంక్షన్ హాలులో ఆదివారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మారుమూల గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి నిర్మల్ నియోజకవర్గానికి రూ. 35 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. సారంగాపూర్లో రూ. 28కోట్లతో 132కేవీ సబ్స్టేషన్ నిర్మించినట్లు తెలిపారు. రాంసింగ్తండాలో సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తే మండలంలో అన్ని నిర్మించుకున్నట్లు అవుతుందన్నారు.
85 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లావెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ చైన్మన్ అయిటి చందు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాజ్మహ్మద్, వంగ రవీందర్రెడ్డి, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాథోడ్ దత్తురాం, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ ఇప్ప మధుకర్రెడ్డి, ఆలూర్ సొసైటీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో సరోజ, డిప్యూటీ తహసీల్దార్ సంతోష్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.