కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/కాగజ్నగర్, నవంబర్ 29 : జిల్లాలో పులుల దాడులు కలకలం రేపుతున్నాయి. అటవీ ప్రాంత గ్రామాల్లో సంచరిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నిత్యం ఎక్కడో చోట పశువుల మందలపై పంజా విసురుతూ దడ పుట్టిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం దహెగాం మండలం దిగడ గ్రామానికి చెందిన విగ్నేశ్ను, పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన పసుల నిర్మలను, గతేడాది వాంకిడి మండ లం ఖానాపూర్కు చెందిన రైతు సిడాం భీము ను పొట్టనబెట్టుకోగా, ఆ ఘటనలు మరవకముందే శు క్రవారం ఓ పులి మరో మహిళను బలి తీసుకున్నది.
పత్తి ఏరుతుండగా దాడి..
కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మి (22) .. శుక్రవారం మరో 20 మంది కూలీలతో కలిసి సమీపంలోని చేనులో పత్తి ఏరేందుకు వెళ్లింది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో అందరూ పనిలో నిమగ్నం కాగా.. పెద్ద పులి ఒక్కసారిగా మోర్లె లక్ష్మిపై దాడి చేసింది. కూలీలు కేకలు వేయడంతో అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. లక్ష్మిని వెంటనే పట్టణంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆ తర్వాత బంధువులు, రైతులు లక్ష్మి మృతదేహంతో కాగజ్నగర్ డివిజనల్ కార్యాలయం వద్దకు చేరుకొని ధర్నా చేశారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే లక్ష్మి మృతి చెందిందని, సంబంధిత సెక్షన్, బీట్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లక్ష్మి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ధర్నా విరమించబోమని భీష్మించుకు కూర్చున్నారు. హుటాహుటిన డీఎఫ్వో కార్యాలయానికి చేరుకున్న ఆదిలాబాద్ సీఎఫ్ శాంతారం, ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి నీరజన్కుమార్ టిబ్రివాల్, ఎస్పీ శ్రీనివాసరావు అంత్యక్రియల కోసం రూ. 20 వేలు, ఎక్స్గ్రేషియా కింద రూ. 10 లక్షల చెక్కును ఆమె కుటుంబ సభ్యులకు అందించారు. మరో రూ. 10 లక్షలు అందించేందుకు కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 5 ఎకరాల భూమి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ కృష్ణారావు, మాజీ జడ్పీటీసీ సుధాకర్రావు, నాయకుడు ఆనంద్ పాల్గొన్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు నలుగురి మృతి
జిల్లాలో పులుల దాడుల్లో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. 2020 నవంబర్ 11న దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విగ్నేష్ చేపల వేటకు వెళ్లగా, పులి దాడి చేయడంతో మృతి చెందాడు. 2020 నవంబర్ 29న పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన పసుల నిర్మల (15) పత్తి ఏరుతుండగా, పెద్ద పులి దాడిచేసి చంపేసింది. అలాగే 2023 నవంబర్ 16న వాంకిడి మండలం ఖానాపూర్కు చెందిన రైతు సిడాం భీము తన చేనులో పత్తి ఏరుతుండగా పులి పంజా విసరడంతో మృత్యువాత పడ్డాడు. తాజాగా.. శుక్రవారం గన్నారంలో పత్తి ఏరుతున్న మహిళపై పులి దాడి చేసి చంపడం స్థానికంగా కలకలం రేపుతున్నది. కాగా, ఉమ్మడి జిల్లాలో పులుల దాడుల దడపుట్టిస్తున్నాయి. ఈ ఏడాది దాదాపు 40 వరకు పశువులపై దాడులు చేశాయి. ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి దాడులు చేస్తాయోనని ప్రజలు వణికిపోతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
చింతలమానేపల్లి/కాగజ్నగర్/పెంచికల్పేట్, నవంబర్ 29 : పులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఎస్వో మోహన్ హెచ్చరించారు. శుక్రవారం కర్జెల్లి రేంజ్ పరిధిలోని చింతలమానేపల్లి పరిసర ప్రాంతాల్లో రైతులకు, పత్తి కూలీలకు అవగాహన కల్పించారు. ఎఫ్బీవో దినేష్ ఉన్నారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో కాగజ్నగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. కమ్మర్గాంలో ఎఫ్ఎస్వో జగన్మోహన్ గౌడ్ పత్తి తీస్తున్న రైతులకు పులి కదలికలపై అవగాహన కల్పించారు.