కేస్లాపూర్లో శనివారం అర్ధరాత్రి మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతరకు భక్తజనం పోటెత్తింది. ఆదివారం ఉదయం వేలాదిగా తరలిరాగా అటవీప్రాంతం కిక్కిరిసింది. నాగోబా స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అడవిబిడ్డలు గంటల తరబడి బారులుతీరి అమ్మవారిని దర్శించుకోగా, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధుల పూజలతో ఎటు చూసినా సందడి కనిపించింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, వ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది.
ఇంద్రవెల్లి, జనవరి 22 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో శనివారం అర్ధరాత్రి మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతరకు భక్తజనం పోటెత్తింది. ఆదివారం ఉదయానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. గంటల తరబడి బారులు తీరి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. జాతరలో పర్యటిస్తూ వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. చిన్నారులు, యువతీ యువకులు రంగుల రాట్నం ఎక్కి సందడి చేస్తున్నారు.
శనివారం అర్ధరాత్రి కలెక్టర్ సిక్తా పట్నాయక్తో పాటు ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల అదనపు కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, గౌతమి, రాహుల్, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీజ, ఎమ్మెల్యేలు రేఖానాయక్, ఆత్రం సక్కు, కోనేరు కొనప్పు, ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, జడ్పీటీసీలు ఆర్కా పుష్పలత, అనిల్జాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
మహాపూజల అనంతరం సంస్కృతీ సంప్రదాయాల నడుమ 190 (95 జతలు) మంది కొత్తకోడళ్లకు నాగోబా సన్నిధిలో (భేటింగ్)పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారికి అమ్మవారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించారు. సతీక్దేవత, నాగోబా దర్శనం అనంతరం కొత్తకోడళ్లు మెస్రం వంశీయుల పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. ఆపై మెస్రం వంశీయుల కోడళ్లుగా స్వీకరించారు. సంప్రదాయబద్ధంగా గోవాడ్లో ప్రవేశం కల్పించారు.
నాగోబా ఆలయానికి కొద్ది దూరంలోనున్న గోవాడ్లో మెస్రం వంశీయుల మహిళల ఆధ్వర్యంలో సంప్రదాయ పూజలు నిర్వహిస్తున్నారు. గోవాడ్లో బసచేసిన మహిళలు కితల వారీగా 22 పొయ్యిలపై సామూహికంగా వంటలు చేస్తున్నారు. నైవేద్యాలు ఉంచిన వెదురు బుట్టలవద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గోవాడ్లో అక్కడక్కడా మహిళలు కుర్చొని నాగోబా చరిత్రతోపాటు మెస్రం వంశీయుల సంప్రదాయాలపై చర్చిస్తున్నారు. మెస్రం వంశీయుల మహిళలతో పాటు కొత్తకోడళ్ల ఆధ్వర్యంలో 22 కితల వారీగా అవ్వాల్దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యాలను సమర్పించారు. అనంతరం ఉపవాస దీక్షలు విరమించి సామూహిక భోజనాలు చేశారు.
నాగోబా జాతరను పురస్కరించుకొని ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. నాగోబా జాతరకు బస్సులు కేటాయించడంతో ఆటోలు, జీప్ల కోసం వేచిచూడాల్సిన అవసరం లేకుండా పోయిందని భక్తులు తెలుపుతున్నారు.
నాగోబా జాతరకు వచ్చేభక్తులకు ఆర్డబ్ల్యూఎస్ శాఖతోపాటు కేస్లాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్, మిషన్ భగీరథ పథకం ఆధ్వర్యంలో తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ట్యాంకులకు మిషన్ భగీరథ పథకం నీటిని సరఫరా చేస్తున్నారు. జాతరలో అక్కడక్కడా నల్లాలు ఏర్పాటు చేశారు. అధికారులు అందుబాటులో ఉండి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
నాగోబా జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్తో పాటు ఉట్నూర్ సీఐ సైదారావ్, ఇంద్రవెల్లి ఎస్ఐ సునీల్ ఆధ్వర్యంలో భారీ పోలీసుబందోబస్తు ఏర్పాటు చేశారు. నాగోబా ఆలయంతో పాటు గోవాడ్ ప్రాంతం, మర్రిచెట్ల ప్రాంతం, కేస్లాపూర్ గ్రామం వద్ద ప్రత్యేక పోలీస్ సిబ్బందిని నియమించి పర్యవేక్షిస్తున్నారు. భక్తులు రద్దీ ఉన్న ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టారు. రాత్రీ పగలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
జాతరలో భక్తుల రద్దీ పెరగడంతో వ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జాతరలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి భక్తులకు సేవలు అందిస్తున్నారు. మెస్రం వంశీయులు బసచేస్తున్న ప్రాంతాలకు వైద్య సిబ్బంది వెళ్లి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్నారు. శిబిరంలో అన్ని రకాల ముందులు అందుబాటులో ఉంచారు.
ఆదివాసుల ఆరాధ్యదైవమైన నాగోబా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా అన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్తోపాటు ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, ఎంపీ బాపురావ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు పాయల్శంకర్, మాజీ జడ్పీ చైర్పర్సన్ సుహసినిరెడ్డి, నాయకులు, మెస్రం వంశీయులు పాల్గొన్నారు.