ఆదిలాబాద్ రూరల్ : పేదల అభివృద్ధే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పండుగల సమయంలో అన్ని కులాలవారికి సరైన ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. తెలంగాణ పండుగల్లో ముఖ్యమైన, మహిళలకు ఇష్టమైన బతుకమ్మ సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించడంతో పాటు తోబుట్టువులకు ప్రతిఏడాది చీరలను పంపిణీ చేస్తున్నామన్నారు. సమాజంలో పురుషులతో పాటు స్త్రీలను సమానంగా గౌరవిస్తూ పదవుల్లోనూ రిజర్వేషన్లను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు.
బీజేపీ , కాంగ్రెస్ నాయకులు కొందరు మగవారు ఎక్కడైనా బతుకమ్మ ఆడుతారా అని టీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడడం మానుకోవాలన్నారు. మహిళల ఆత్మగౌరవం పెంపుకోసమే తాము బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. బతుకమ్మ సంబరాల్లో ఆడమగతో సంబంధంలేకుండా తమ పార్టీ కార్యకర్తలు మహిళలకు అండగా ఉంటారన్నారు. అనంతరం కరోనా సమయంలోనూ తమ ప్రాణాలకు తెగించి పారిశుధ్య పనులు చేపట్టిన కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, అదనపు కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, మున్సిపల్ కమిషనర్ శైలజ, వైస్చైర్మన్ జహీర్ రంజానీ ,ఆత్మ డివిజన్ చైర్మన్ రమేశ్, కౌన్సిలర్లు బండారి సతీశ్, అశోక్స్వామి, నర్సింగ్, లక్ష్మణ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్, కార్యదర్శి అశ్రఫ్ తదితరులుపాల్గొన్నారు.