మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గం ప్రగతిపథాన దూసుకుపోతున్నది. ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ప్రత్యేక చొరవతో దాదాపు రూ. 200 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇందులో కొన్ని పూర్తికాగా.. మరికొన్ని శరవేగంగా జరుగుతున్నాయి. వీటి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మాత్యులు తన్నీరు హరీశ్రావు రేపు(బుధవారం) చెన్నూర్కు రానున్నారు. వీటిలో కేసీఆర్ పార్కు, మినీ స్టేడియం, రహదారి విస్తరణ పనులు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాల ప్రారంభోత్సవం.. వంద పడకల దవాఖాన, బస్డిపో, సమ్మక్క-సారలక్క మహిళా భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఇందుకోసం విప్ బాల్క సుమన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
చెన్నూర్, మార్చి 13 : చెన్నూర్ పట్టణానికి అభివృద్ధి శోభ సంతరించుకుంది. ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే చెన్నూర్ పట్టణాభివృద్ధిపై దృష్టి సారించారు. పట్టణంలో పలుమార్లు పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. పరిష్కారానికి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేసి నిధులు మంజూరు చేయించారు. పూర్తయిన అభివృద్ధి పనులకు ఈనెల 15న ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మాత్యులు హరీశ్రావు శంకుస్థాపన చేయనున్నారు.
రూ 2.50 కోట్లతో నిర్మించిన కేసీఆర్ పార్కు, రూ.4 కోట్లతో నిర్మించిన మినీ స్టేడియం, రూ.25 కోట్లతో నిర్మించిన ప్రధాన రహదారి విస్తరణ, రూ.6 కోట్లతో నిర్మించిన పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్, రూ.3 కోట్లతో నిర్మించిన కుమ్మరికుంట మినీ ట్యాంక్ బండ్, రూ.7 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ భవనాలను ప్రారంభించను న్నారు. అలాగే రూ.40 కోట్లతో నిర్మించే వంద పడకల దవాఖాన భవన నిర్మాణానికి, రూ.4 కోట్లతో నిర్మించే బస్డిపో, రూ.1.50 కోట్లతో నిర్మించే సమ్మక్క-సారలక్క మహిళా భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.9.90 కోట్లతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.
రెండు మినీ ట్యాంకు బండ్లు
చెన్నూర్ పట్టణంలో రూ.6 కోట్లతో పెద్ద చెరువు మినీ ట్యాంకు బండ్, రూ.3 కోట్లతో కుమ్మరికుంట మినీ ట్యాంకు బండ్లను నిర్మించారు. చెరువు కట్టల పొడవునా సెంట్రల్ లైటింగ్తోపాటు కట్టకు పచ్చికతోపాటు పూల మొక్కలను పెంచారు. కట్టపై కూర్చుండి సేద తీరేందుకు కుర్చీలు, వాకింగ్ చేసేందుకు వాకింగ్ ట్రాక్లు నిర్మించారు. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసుకునే వారికి, విశ్రాంతి కోసం వెళ్లే వారికి ఈ రెండు మినీ ట్యాంకు బండ్లు ఉపయోగపడనున్నాయి.
ప్రజలు, వ్యాపారులు, రైతులకు ఉపయోగం
చెన్నూర్ పట్టణంలో రూ.7 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్తో కూరగాయల వ్యాపారులు, రైతులు, ప్రజలకు ఉపయోగం చేకూరనుంది. ప్రస్తుతం పట్టణంలో మార్కెట్ వసతి లేకపోవడంతో రోడ్డుపైనే విక్రయిస్తున్నారు. దీంతో పట్టణవాసులు ఇబ్బంది పడుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తుతోపాటు అన్ని వసతులతో పట్టణ నడిబొడ్డున మార్కెట్ భవనాన్ని నిర్మించారు.
ప్రజలందరికీ అన్ని రకాల వైద్యసేవలు
చెన్నూర్ పట్టణ సమీపంలోని జాతీయ రహదారి పక్కన రూ.40 కోట్లతో వంద పడకల దవాఖాన నిర్మిస్తుండడంతో ప్రజలందరికీ మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. నియోజకవర్గంలోని చెన్నూర్, కోటపల్లి, భీమారం మండలాల ప్రజలతోపాటు బెల్లంపల్లి మండలంలోని వేమనపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్, కాటారం మండలాలు, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకా ప్రజలకు కూడా మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి.
నెరవేరనున్న చిరకాల స్వప్నం
చెన్నూర్ పట్టణంలో రూ.4 కోట్లతో బస్డిపో ఏర్పాటు చేస్తుండడంతో స్థానికుల చిరకాల కోరిక నెరవేరనుంది. పట్టణంలోనే డిపో ఏర్పాటు కానుండడంతో నియోజకవర్గంలోని గ్రామాలతోపాటు మహారాష్ట్రలోని సిరోంచ, ఛత్తీస్గఢ్లోని భీజాపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, కాటారం వంటి గ్రామవాసులకు బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగనుంది.
ఆహ్లాదం.. ఆనందం కేసీఆర్ పార్కు
ప్రజలు సేదతీరేందుకు పట్టణ నడిబొడ్డున రూ.2.50 కోట్లతో కేసీఆర్ పార్కును నిర్మించారు. ఉదయం, సాయంత్రం వేళ ఆహ్లాదంగా ఉండేందుకు చిన్న పిల్లలు ఆడుకునేందుకు వస్తువులు, బొమ్మలు.. వాకింగ్ కోసం వాకింగ్ ట్రాక్లు, జిమ్తోపాటు, యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చక్కటి వాతావరణానికి పచ్చికతోపాటు, పూల మొక్కలను పెంచారు. సేద తీరేందుకు కుర్చీలకు ఏర్పాటు చేశారు.
మినీ స్టేడియం క్రీడాకారులకు మేలు
పట్టణ సమీపంలో రూ.4 కోట్లతో నిర్మించిన మినీ స్టేడియం క్రీడాకారులకు ఉపయోగ పడనుంది. ఈ స్టేడియం నిర్మాణం పూర్తయితే ఇందులో ప్రతిభావంతులైన క్రీడాకారులు శిక్షణ పొందవచ్చు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి రానున్నారు. అన్ని వసతులతో స్టేడియాన్ని నిర్మించడంతో అనేక రకాల క్రీడా పోటీలు నిర్వహించవచ్చు.
చాలా సంతోషంగా ఉంది..
చెన్నూర్ పట్టణంతోపాటు, నియోజకవర్గ వ్యాప్తంగా విప్ బాల్క సుమన్ చేపట్టిన పలు అభివృద్ధి పనులను చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మారుమూల గ్రామాలకు వాగులపై భారీ వంతెనలతోపాటు రహదా రులను నిర్మించారు. ప్రతి గ్రామానికి నాలుగు వైపులా రహదారి సౌకర్యం ఉండే విధంగా చూస్తున్నారు. అలాగే గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా మంచి పనులు చేస్తున్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్కు నియోజకవర్గ ప్రజలు అండగా ఉంటారు.
– గడ్డం శంకర్, స్థానికుడు, చెన్నూర్
వన్నె ప్రధాన రహదారి విస్తరణ
జలాల్ పెట్రోల్ బంక్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రూ.25 కోట్లతో చేపట్టిన ప్రధాన రహదారి విస్తరణ పట్టణానికే వన్నే తెచ్చింది. రహదారి మధ్యలో డివైడర్, ఇందులో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్, చెట్లు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇరువైపులా మురుగు కాలువలను నిర్మించి, ఫుట్పాత్ను నిర్మించారు. ప్రధాన రహదారిలోని ఆస్నాద్ చౌరస్తా(తెలంణ తల్లి విగ్రహం), ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ప్రతాప మారుతి హనుమాన్ చౌరస్తా కూడళ్లను సుందరీకరించి, పౌంటేయిన్ నిర్మించారు. దీంతో పట్టణ రూపురేఖలే మారి పోయాయి.
మహిళ కోసం ‘సమ్మక్క-సారలక్క’ భవనాలు
మహిళలు ఆర్థిక పరిపుష్ఠి సాధించాలనే లక్ష్యం తో నియోజకవర్గవ్యాప్తంగా ‘సమ్మక్క-సారలక్క’ పేరిట మహిళా భవనాలు నిర్మిస్తు న్నారు. మొదటి విడుతలో చెన్నూర్ పట్టణం లో రూ.1.50 కోట్లతో 69 గ్రామాల్లో మహిళా భవనాలు నిర్మించనున్నారు. ఈ భవనాల నిర్మాణాలతో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇబ్బందులు తప్పనున్నాయి.
వేగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణాలు
చెన్నూర్ పట్టణంలో ప్రభుత్వ దవాఖాన(కమ్యూనిటీ హెల్త్ సెంటర్) నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని వసతులతో రూ 9.90 కోట్లతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. రెండు, మూడు నెలల్లో భవనం అందుబాటులోకి రానుంది.
సుమన్తోనే అభివృద్ధి..
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చెన్నూర్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాతనే పట్టణ రూపురేఖలు మారిపోయాయి. ఇంతకముందు ఏ నాయకుడు కూడా అభివృద్ధి చేయలేదు. రోడ్లు ఎట్లున్నా పట్టించుకోలేదు. చాలా ఇబ్బంది అయ్యేది. సుమన్ దమ్మున్న నాయకుడు కాబట్టే భారీ మొత్తంలో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాడు. మా నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలువనుంది. చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు సుమన్కు రుణపడి ఉంటారు.
– గూడెపు రామారావు, యువకుడు, చెన్నూర్.
చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు
చెన్నూర్ నియోజకవర్గ చరిత్రలోనే 15వ తేదీ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా రూ.200 కోట్ల పైచిలుకు నిధులతో చెన్నూర్ నియోజకవర్గంలో ఒకే రోజు పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. నూతన మార్కెట్ కమిటీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా ఉంటుంది. ఇందారం, భీమారం, జైపూర్, చెన్నూర్లలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్తో రహదారులన్నీ వెలుగు జిలుగులు సంతరించుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి చెన్నూర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతా. ఈ నెల 15న నిర్వహించే కార్యక్రమాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి.