ఆదిలాబాద్ రూరల్ : చనిపోయిన వారి ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం కులమతాలతో సంబంధం లేకుండా అన్ని రకాల శ్మశానవాటికలను అభివృద్ధి చేస్తుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం పట్టణంలోని సుభాష్ నగర్లో రూ. 24లక్షలతో చేపట్టనున్న శ్మశానవాటిక అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో శ్మశానవాటికల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. చివరి మజిలీకి వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ శ్మశానవాటికల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారన్నారు.
హరితహారం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లకు భారీగా నిధులు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తూవారిని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుటుందన్నారు. అనంతరం కాలనీలో నూతనంగా ఏర్పాటైన అభివృద్ధి కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్ లక్ష్మణ్, భరత్, శైలేందర్ , కాలనీ వాసులు పాల్గొన్నారు