ఇంద్రవెల్లి, డిసెంబర్ 7 : ఆధ్మాత్మిక మార్గంతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. ఇంద్రవెల్లి మండలం అంజీ గ్రామంలోని పూలాజీబాబా ధ్యాన కేంద్రం 33వ వార్షికోత్సవం బుదవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని, పూలాజీ బాబా చిత్రపటం వద్ద పూజలు చేశారు. ఆంధ్ ఆదివాసీ సమాజ్ సంప్రదాయ ప్రకారం నిర్వహించిన ఓ చిన్నారి నామకారణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, ఆ చిన్నారికి ఆకాశ్ అని పేరు పెట్టారు. ముందుగా ఆంధ్ ఆదివాసీ సమాజ్ పెద్దల ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్మాత్మిక మార్గంలో ముందడుగు వేయాలన్నారు.
ముఖ్యంగా యువత వ్యసనాలకు దూరంగా ఉండి, ఆధ్మాత్మిక మార్గంతోపాటు చదువుకు ప్రాధాన్యమివ్వాలన్నారు. గ్రామాల్లో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజల్లో ఐక్యత ఏర్పడుతుందని పేర్కొన్నారు. అనంతరం పూలాజీబాబా వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని రిమ్స్ దవాఖాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో 31 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి, సర్పంచులు కుడే కైలాస్, కుసుమబాయి, ఆంధ్ ఆదివాసీ సమాజ్ జిల్లా అధ్యక్షుడు విష్ణుముకాడే, ధ్యానకేంద్రం అధ్యక్షుడు దశరథ్ గారుళే, భక్తులు పోటే సాయినాథ్, ఉత్తం, దశరథ్, జైవంత్రావ్, వినయ్మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.
పెసా చట్టం రూపకర్త బీడీ శర్మ 7వ వర్ధంతిని పురస్కరించుకొని ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ఆ చట్టం అధ్యక్ష, కార్యదర్శుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ముందుగా బీడీ శర్మ చిత్రపటానికి పీవో వరుణ్ రెడ్డి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో పెసా చట్టం అమలుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పెసా చట్టం పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఈ చట్టం అమలుకు 25 ఏండ్లు పూర్తయిందని తెలిపారు. అనంతరం ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ మాట్లాడుతూ.. ఆదివాసీ ప్రజలకు పెసా చట్టం అమలు గురించి అవగాహన కల్పిస్తామన్నారు. ఈ చట్టం ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమలో ఏపీవో(పీవీటీజీ) ఆత్రం భాస్కర్, జిల్లా సర్మేడి మెస్రం దుర్గు, విశ్రాంత డాక్టర్ చందు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చిన పేసా చట్టం అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.