ఆసిఫాబాద్ టౌన్, ఆగస్టు 24: పోషకాహార లోపం నివారణకు కృషి చేయాలని నీతి అయోగ్ ప్రతినిధి సలోని భుటాని అన్నారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విస్తృతంగా పోషక విలువలు గల చిరుధాన్యలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని, అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, పిల్లలకు సమాయానుసారంగా పోషకాహారాన్ని అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితులను పరీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ’మిషన్ సంపూర్ణ పోషణ్’ కార్యక్రమం ద్వారా దేశీయ పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
గిరిజన ప్రాంతాల్లో రాగి పంటను సాగు చేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, బాల్యవివాహాల నియంత్రణపై అన్ని శాఖల అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో యువతులకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే పెళ్లి జరిపించాలనే ప్రచారం చేపట్టాలన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పిల్లలు, మహిళల ఆరోగ్య విషయంలో జిల్లా అధికార యంత్రంగం చేపట్టిన చర్యలను ఆయన అభినందించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో చిరుధాన్యలను పంపిణీ చేయడంతో పాటు పిల్లలు, మహిళ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. జిల్లాల్లో రైతులకు అవగాహన కల్పించి ప్రస్తుతం 10 వేల ఎకరాల్లో చిరుధాన్యలు, కూరగాయలు సాగు చేయిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.