నిర్మల్, మే 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్పై నమోదైన లైంగిక వేధింపుల కేసులో ఇప్పటివరకు ఆయనను అరెస్ట్ చేయకపోవడం దారుణమని బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కొరిపెల్లి రాంకిషన్రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లైంగిక వేధింపులకు పాల్పడి, పోక్సో కేసు నమోదైనందున నిందితుడిని చట్ట ప్రకారం 24 గంటల్లో అరెస్ట్ చేయాల్సి ఉంటుందని, కానీ మూడురోజులైనా అరెస్ట్ చేయకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు భగీరథ్పై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారని ఆరోపించారు.
భగీరథ్పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలన్నారు. భగీరథ్ ఆచూకీ తెలిపిన వారికి బహుమతిని సైతం ప్రకటించాలన్నారు. ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. లేదా ఆయనను ప్రధానమంత్రి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబంపై బెదిరింపులకు పాల్పడటమే కాకుండా, సాక్ష్యాలను దాచిపెట్టే ప్రయత్నించినందుకు బండి సంజయ్ను, ఆయన అనుచరులను కూడా ఈ కేసులో సహ నిందితులుగా చేర్చాలని డిమాండ్ చేశారు.
బాధితురాలికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రక్షణ కల్పించి, మెజిస్ట్రేట్ ఎదుట 164 స్టేట్మెంట్ రికార్డు చేయించాలని కోరారు. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి, ముఖ్యమంత్రి అయిన రేవంత్రెడ్డి కనీసం స్పందించకుండా ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నిర్మల్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, నాయకులు మహేశ్రెడ్డి, నయీం తదితరులు పాల్గొన్నారు.