ఎదులాపురం,మే 27: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై స్థానిక టీఎన్జీవోస్ భవనంలో జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులకు శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో జూన్2 నుంచి 22 వరకు నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి రోజు వారీ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆదిలాబాద్ జిల్లా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధించిందని తెలిపారు. వివిధ రంగాల్లో జిల్లాకు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని వెల్లడించారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేయనున్న కార్యక్రమాల్లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు.
దశాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా జూన్2న పతాకావిష్కరణ, అమరులకు నివాళి, 3న రైతు దినోత్సవం, 4న పోలీస్ శాఖ ద్వారా సురక్షా దినోత్సవం, 5న విద్యుత్ విజయోత్సవం, 6న పారిశ్రామిక ఉత్సవం, 7న సాగునీటి దినోత్సవం, 8న చెరువుల పండుగ, 9న సంక్షేమ సంబురాలు, 10న సుపరిపాలన దినోత్సవం, 11న సాహిత్య సంక్షేమ దినోత్సవం, 14న వైద్యారోగ్య దినోత్సవం, 15న పల్లె ప్రగతి దినోత్సవం, 16న పట్టణ ప్రగతి దినోత్సం, 17న గిరిజనోత్సవం, 18న మంచి నీళ్ల పండుగ, 19న హరితోత్సవం, 20న విద్యా దినోత్సవం, 21న ఆధ్యాత్మిక దినోత్సవం, 22న అమరులకు నివాళి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని దశాబ్ది వేడుకల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలపై శాఖల వారీగా చర్చించారు. సమావేశంలో టైనీ అసిస్టెంట్ కలెక్టర్ వికాస్ మహతో, డీఎఫ్వో రాజశేఖర్ పెట్ల, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీవోలు రమేశ్ రాథోడ్, కదం సురేశ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు,ఎంపీవోలు, ఏపీవోలు, ఏపీఎంలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.