బేల, మే 26 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేలలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి రాంచందర్ రెడ్డి నోటా పార్టీలో ఎవరికి టికెట్ వచ్చినా అందరం కలిసికట్టుగా పని చేస్తామని అనడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్లోఅతనికి టికెట్ వస్తే అందరూ ఏకమవ్వాలి, ఇతరులకు టికెట్ వస్తే ఓడించాలి ఇదే సీఆర్ఆర్ రాజకీయ చరిత్రకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవనడం, అందరం ఒకటవడమనేది అసాధ్యమైన విషయమని స్పష్టం చేశారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీని గద్దెదించాలనే సంకల్పంతోనే దేశంలోని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీజేపీ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే ఇంకా 20 సంవత్సరాల పాటు పాలన కొనసాగాలని ప్రజలు కొరుకుంటున్నారని అన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగు రామన్న చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధితో వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఘనవిజయం సాధిస్తారని తెలిపారు. ఏ గ్రామానికి వెళ్లిన జోగు రామన్నకు జైజైలు పలుకుతున్నారని తెలిపారు. అమరవీరులను స్మరించుకుంటూ అన్ని గ్రామాల్లో జూన్ 2 నుంచి 21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ర్టావతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గంభీర్ఠాక్రే, ప్రమోద్రెడ్డి, సతీశ్పవార్, మస్కే తేజ్రావ్, దేవన్న, బాల్చందర్ పాల్గొన్నారు.