నార్నూర్, ఫిబ్రవరి 14 : ఏజెన్సీ ప్రాంతంలోని నార్నూర్ మండలంలో రోజురోజుకూ మత్తు పదార్థాలకు బానిసలవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ప్రధానంగా యువత దాని బారినపడి జీవితాలను కోల్పోతున్న పరిస్థితులున్నాయి. మద్యమే కాకుండా పొగాకు, గంజాయి, కొన్ని రకాల రసాయనాలను పీల్చడం వంటి వ్యసనాలు పెరుగుతున్నాయి. ఇందులో ప్రధానమైనది మద్యం,గంజాయి వినియోగించి ఆరోగ్యాలను సైతం కోల్పోతున్నారు.
నార్నూర్ గంజాయి ప్రియులకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది యువకులు ఒక దగ్గరికి చేరి గంజాయి తీసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటి దాకా నాటుసారా, మద్యానికి మాత్రమే అలవాటు పడిన యువత రానురాను గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుం టున్నారు. రోడ్డు పక్కన గల అటవీ ప్రాంతం, రహస్య ప్రదేశాల్లో గంజాయి సేవిస్తూ మత్తులో తూగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
జల్సాలకు అలవాటు పడిన యువత రాత్రి 10 గంటలు దాటినా రోడ్లపైనే సంచరిస్తున్నారు. గుంపులు గుంపులుగా చేరి గొడవలకు సైతం దిగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. గతంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకొగా ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు.
ఏజెన్సీలోని యువత హైస్పీడ్ ద్విచక్ర వాహనాలపై అడ్డూఅదుపు లేకుండా స్పీడ్గా వెళ్తూ పాదచారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదాలు జరిగినా తప్పించుకునే ఎత్తుగడలను యువత అనుసరిస్తున్నారు. యువతను అదుపులో పెట్టాల్సిన అవసరం తల్లిదండ్రులకు చాలా ఉంది. ప్రజా ప్రతినిధులు కూడా ముందు కు వచ్చి తమ గ్రామాల్లోని యువతకు కౌన్సిలింగ్ ఇచ్చి పెడదోవ పట్టకుండా చర్యలు తీసుకోవాలి. ప్రధాన రహదారిపై పోలీసులు రాత్రిపుట పెట్రోలింగ్ నిర్వహించి, అసాంఘిక చర్యలకు అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
యువత గంజాయి, మద్యానికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. మద్యం మత్తులో గొడవలు పెట్టుకొని క్రిమినల్ కేసులు నమోదైతే, చేతులా జీవితాలను నాశనం చేసుకున్నవాళ్లు అవుతారు. గంజాయికి అలవాటు పడి ఆనారోగ్యం పాలు కావద్దు. మంచి జీవితాలను లక్ష్యంగా ఎంచుకొని యువత ముందుకు వెళ్లాలి. మద్యం మత్తులో వాహనాలను నడిపి ప్రాణాలను తీసుకోవద్దు. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తాం.
కే ప్రేమ్కుమార్, సీఐ,నార్నూర్