కెరమెరి: ఆదివాసీలు అత్యంత వైభవంగా జరుపుకునే దండారి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చిందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని సాకడ, మోడి, పన్గూడ గ్రామాలో పర్యటించి ఏత్మాసార్ పేన్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివాసీలు నిర్వహిస్తున్న దండారి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని సంప్రదాయ కోలాట నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, దండారి వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు సర్కార్ కోటి రూపాయల నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు.
ఎంతో విలువైన సంస్కృతి, సంప్రదాయలు రాబోయే తరాలకు అందించేలా పటేళ్లు, గ్రామ పెద్దలు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెందోర్ మోతిరాం, జడ్పీటీసీ సెడ్మాకి ధుర్పతాబాయి, ఆత్రం సక్కు యూత్ ఫోర్స్ జిల్లా అధ్యక్షుడు ఆత్రం వినోద్ కుమార్, మండల అధ్యక్షుడు కుమ్రం భీంరావ్, సర్పంచులు కుమ్రం నాణేశ్వర్, తొడసం జగన్నాథ్రావ్ తదితరులు పాల్గొన్నారు.