కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/సిర్పూర్(యు), ఏప్రిల్ 5: వడదెబ్బతో ఓ ఉపాధి హామీ కూలీ మృతి చెందగా, తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్లో జరిగింది. ఎల్లాపటార్ గ్రామానికి చెం దిన 9 మంది కూలీలు శనివారం ఉపాధి హామీ పనులకు వెళ్లారు. పనులు ముగించుకొని ఇంటి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. ఆత్రం అక్బర్ షా(33) ఆదివారం ఉదయం మృత్యువాత పడ్డాడు.
ఈయన భార్య ఆత్రం తుర్పాబాయి తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. వీరితో పాటు ఉపాధి హామీ పని ప్రదేశానికి వెళ్లిన ఇద్దరు పిల్లలు ఆత్రం రాము, ఆత్రం యశోద, కూలీలు ఆత్రం సుజాత, హీరాబాయి, సీతారాం, కోవ సేవాబాయి, సుజాత, దినకర్ వడదెబ్బ బారిన పడ్డారు. వీరిలో సీరియగా ఉన్న ఆత్రం తుర్పాబాయిని మెరుగైన వైద్యం కోసం ఉట్పూర్ హాస్పిటల్కు తరలించారు. మిగతా వారికి ప్రథమ చికిత్స చేసి ఇళ్లకు పంపించారు.
పని ప్రదేశాల్లో కనీస వసతులు కరువు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 1.20 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ జాబ్కార్డ్లు ఉన్నాయి. వీరికి 100 రోజుల పని దినాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఇక పనుల ప్రదేశాల్లో ఎలాంటి వసతులు కల్పించకపోవడంతో కూలీలకు ప్రాణ సంకటంగా మారుతున్నది. నీడ, నీరు, ఫస్ట్ఎయిడ్ కిట్లువంటి వసతులు కల్పించకపోవడంతో కూలీలు అనేక అవస్థలు పడాల్సి వస్తున్నది.