సైబర్ నేరగాళ్లు పంథా మార్చి రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ వేదికగా వ్యాపారులు, అమాయక ప్రజలను టార్గెట్ చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఆయా దుకాణాల బోర్డులపై ఉన్న సెల్నంబర్లను సేకరించి.. కుచ్చుటోపీ పెడుతున్నారు. సరుకులు కావాలని కోరి.. తీరా సరఫరా చేశాక బిల్లు మొత్తాన్ని తాము పంపిన స్కానర్లకు పంపితే.. అన్నీ కలిపి రిటర్న్ కొడుతామని నమ్మబలికి స్వాహా చేస్తున్నారు. పైగా లోన్ల పేరిట ఆశచూపి.. ఓటీపీ చెప్పగానే ఖాతాల్లోంచి డబ్బులు ఖాళీ చేస్తున్నారు. ఇటీవల జిల్లాలో ఇలాంటి తరహా ఘటనలు జరుగగా, అప్రమత్తంగా ఉండాలంటూ ఎస్పీ సురేశ్కుమార్ హెచ్చరిస్తున్నారు.
– ఆసిఫాబాద్, సెప్టెంబర్ 10
సైబర్ నేరాలపై ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తు న్నాం. బ్యాంకు నుంచి వచ్చినట్లు మెస్సేజ్లు వస్తే వాటిని నమ్మవద్దు. అపరిచితుల ద్వారా వచ్చిన మెస్సేజ్ లు, కాల్స్ను నమ్మి ఓటీపీలు చెప్ప వద్దు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగినా వెంటనే పోలీసులు, బ్యాంకు అధికారులను సంప్రదించాలి. తద్వారా బ్యాంక్ అకౌంట్స్ లాక్ చేయడంతో పాటు సైబర్ నేరగాళ్లును ట్రాక్ చేసే అవకాశముంటుంది.
– సురేశ్కుమార్, ఎస్పీ
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 10 : సైబర్ నేరగాళ్లు పంథా మార్చారు. కొత్త తరహాలో మోసాలకు దిగుతున్నారు. ఇది వరకు సెల్ఫోన్కు మెస్సేజ్లు పంపి లింకులను ఓపెన్ చేయాలని, లక్కీ డ్రా, గిఫ్టులు వచ్చాయంటూ దోచుకున్న సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. వ్యాపారులను టార్గెట్ చేస్తూ కుచ్చుటోపీ పెడుతున్నారు. వ్యాపార సంస్థల బోర్డులపై ఉన్న సెల్ నంబర్లను సేకరిస్తూ వారికి ఫోన్ చేసి సరుకులు కావాలని, వచ్చాక డబ్బులు పంపిస్తామని నమ్మబలుకుతున్నారు. తీరా సరుకులు చేరిన చోట ఎవ్వరూ ఉండక పోగా.. పైగా అక్కడే దింపాలని, తర్వాత వచ్చి తీసుకుంటామని చెబుతున్నారు. డబ్బులు ఇవ్వాలని వ్యాపారులు కోరితే.. పేపెంట్ యాప్ స్కానర్ ఫొటోను వాట్సప్ ద్వారా పంపిస్తున్నారు. దీనికి తోడు రూ. 1 కూడా పంపి.. ఆ తర్వాత బిల్లు ఎంత అయ్యిందో ఆ మొత్తం పంపిస్తే అన్ని కలిపి రిటర్న్ చెల్లిస్తామని నమ్మబలికి మోసం చేస్తారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఇలాంటి ఘటనలే జరిగాయి. ఓ వ్యక్తి హార్డ్వేర్ వ్యాపారికి ఫోన్ చేసి 150 సిమెంట్ బస్తాలు కావాలని మోసం చేసే ప్రయత్నం చేశాడు. సదరు వ్యాపారి ఇది గ్రహించి సరుకు పంపించలేదు. దీంతో సైబర్ నేరగాడు వ్యాపారికి కాల్ చేసి తిట్లపురాణం అందుకున్నాడు. తన స్నేహితుడి సలహాతో సదరు వ్యాపారి సైబర్ నేరాగాడి నుంచి తప్పించుకున్నాడు.
అలాగే జిల్లా కేంద్రానికి చెందిన మరో వ్యాపారికి రేకులు కావాలని ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. అతను చెప్పిన చోటుకి ట్రాలీలో రేకులను పంపించాడు. రేకులకు ఎన్ని డబ్బులు అయ్యాయో.. నేను వాట్సప్లో పంపిన స్కానర్కు పంపితే.. తిరిగి మొత్తం చెల్లిస్తానని నమ్మబలికాడు. దీంతో సందరు వ్యాపారి రూ. 4 వేలు పంపించాడు. ఆ తర్వాత ఫోన్ చేస్తే.. లిఫ్ట్ చేయడం మానేశాడు. మోసం జరిగిందని గమనించిన వ్యాపారి రేకులను తిరిగి తెప్పించుకున్నాడు. ఇంతేకాకుండా ఓ ప్రభుత్వ ఉద్యోగి సైతం సైబర్ నేరగాడి ఉచ్చులో పడ్డాడు. లోన్ ఇస్తామంటూ సదరు ఉద్యోగికి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. వాట్సాప్కి డాక్యుమెంట్లు పంపించమని అడిగాడు. తీరా పంపించాక.. ఓటీపీ చెప్పుమని కోరాడు. ఓటీపీ నంబర్లు చెప్పాక అకౌంట్లో ఉన్న సుమారు నాలుగు లక్షల దాకా కాజేసినట్లు తెలిసింది. ఈ విషయం బయటకు వస్తే చదువుకొని కూడా మోసపోయాడని అంటారని కిమ్మనకుండా ఉండిపోయాడు. ఇలా అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు.. కొత్త రూట్లను వెతుకుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. సైబర్ నేరగాలతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహించినప్పటికీ ప్రజల్లో మార్పు రావడం లేదు. ఇలాంటి కేసులు పోలీసులకు తలనొప్పిగా మారాయి. సైబర్ నేరానికి పాల్పడే వ్యక్తి అడ్రస్ సక్రమంగా ఉండదు.. అంతే కాకుండా వాళ్లు వాడే ఫోన్ సిమ్ సైతం ఫేక్ ఐడీలతో ఉండడంతో కేసులను చేధించడం ఇబ్బందిగా మారుతుంది.
కంప్యూటర్లను అనధికారంగా, మోసపూరితంగా యాక్సెస్ చేసేందుకు ఈ టెక్నాలజీని నేరగాళ్లు ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో చొరబాటుదారులు ఐపీ హోస్ట్ ఉన్న కంప్యూటర్కు కొన్ని రకాల మెస్సేజ్లను పంపుతారు. అది ట్రస్ట్ హోస్ట్ నుంచి వస్తున్నట్లు నమ్మిస్తారు. దీని ద్వారా సిస్టమ్ను తమ ఆధీనంలోకి తీసుకుంటారు.
వినియోగదారుడి పేరు, పాస్ వర్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు.. వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడానికి చేసే నేరాన్ని ఫిషింగ్ అంటారు. విశ్వసనీయ సంస్థగా లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లోని వ్యక్తిగా మారువేషాల ద్వారా ఈ మోసాలకు పాల్పడతారు.
సైబర్ క్రైమ్లో దొంగతనం, మోసం, ఫోర్జరీ, పరువు నష్టం, అల్లర్లువంటి నేర కార్యకలాపాలు ఉంటాయి. వీటన్నింటికీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం శిక్షలు విధిస్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 కింద అన్ని రకాల సైబర్ నేరాలకు శిక్షలు అమల్లో ఉన్నాయి.
ఇంటర్నెట్వంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా వేధింపులకు గురిచేయడాన్ని సైబర్ స్టాకింగ్ అంటారు.
కంప్యూటర్ ఆధారంగా నేరాలకు పాల్పడేవన్నీ సైబర్ నేరాల కిందకే వస్తాయి. కంప్యూటర్ ద్వారా మోసాలకు పాల్పడడం లేదా టెక్నాలజీని ఉపయోగించి కంప్యూటర్లపై దాడి చేయడం. ఈ రెండూ చట్టవిరుద్ధమైన చర్యలే. కంప్యూటర్ సిస్టమ్స్ లేదా నెట్ వర్లను అక్రమంగా, అనధికారంగా యాక్సెస్ చేయడం.. లేక హ్యాకింగ్ చేయడం, ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారాన్ని దొంగిలించడం, ఈ మెయిల్ బాంబింగ్, సలామి ఎటాక్, సర్వీస్ ఎటాక్ను అడ్డుకోవడం, వైరస్ లేదా వార్మ్ దాడులు, లాజిక్ బాంబ్స్, ఇంటర్నెట్ టైమ్ థెఫ్ట్స్… వంటివన్నీ వివిధ రూపాల్లో ఉండే సైబర్ నేరాలు.