కీరదోస.. రైతన్నలకు కాసులు కురిపిస్తున్నది. ఔషధ గుణాలు అధికంగా ఉండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నెల రోజుల్లోనే చేతికొస్తుండడం.. తక్కువ పెట్టుబడి కావడం, ఆదాయం అధికంగా సమకూరుతుండడంతో అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు. యేడాదంతా ఫుల్ డిమాండ్ ఉండడంతో వాణిజ్య పంటగా సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఆహారంగా వినియోగించడంతోపాటు శుభకార్యాల్లో కూడా సలాడ్ తయారీకి వాడుతున్నారు. ఎకరంలో కీరదోస సాగు చేస్తే రూ.లక్ష వరకు ఆదాయం వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. ప్రధానంగా నిర్మల్ జిల్లాలోని మామడ, లక్ష్మణచాంద, లోకేశ్వరం, నిర్మల్ రూరల్, సోన్ మండలాల్లో 516 ఎకరాల్లో కీరదోస సాగవుతోంది.
– నిర్మల్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ)
నిర్మల్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : ఔషధ గుణాలు మెండుగా ఉన్న కీర సాగు రైతులను లాభాల బాట పట్టిస్తున్నది. ఆహార పంటగానే కాకుండా, వాణిజ్య పంటగా కూడా రైతులు సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. తక్కువ రోజుల్లోనే చేతికి వచ్చే కీరకు మార్కెట్లో ఏడాది పొడవునా డిమాండ్ ఉంటున్నది. ముఖ్యంగా మండు వేసవిలో చల్లదనం కోసం చాలా మంది కీరదోసను ఆహారంగా తీసుకుంటారు. దీంతో వేసవిలో ఎక్కువగా గిరాకీ ఉంటుంది. ఒకప్పుడు కీరను కేవలం వేసవిలోనే సాగు చేసేవారు. కానీ ప్రస్తుతం ఏడాదంతా సాగు చేస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో ఈ పంటను ఏ నేలల్లోనైనా సాగు చేసుకోవచ్చు. రోజు విడిచి రోజు వచ్చే పంట దిగుబడులను రైతులే స్వయంగా మార్కెట్లో విక్రయించుకొని లాభాలు పొందుతున్నారు. నిర్మల్ జిల్లాలోని మామడ, లక్ష్మణచాంద, లోకేశ్వరం, నిర్మల్ రూరల్, సోన్ తదితర మండలాల్లో 516 ఎకరాల్లో కీర పంటను రైతులు సాగు చేస్తున్నారు. సంప్రదాయంగా పండించే పంటలకు బదులుగా నీటి వసతి ఉన్న రైతులు ఎక్కువ లాభాలు వచ్చే కీర సాగువైపు మొగ్గు చూపుతున్నారు. చాలా చోట్ల వరికి ప్రత్యామ్నాయంగా రైతులు కీర, ఇతర కూరగాయల పంటలను సాగు చేసి లాభాలు గడిస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో కీరదోసకు మంచి డిమాండ్ ఉండడంతో రైతులకు మెరుగైన ఆదాయం వస్తున్నది. కీరను ప్రజలు ఆహారంగా తీసుకోవడంతో పాటు శుభ కార్యాల్లో సలాడ్ రూపంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో కీరకు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటున్నది. విత్తిన 25-30 రోజుల్లోనే కీర కాయలు చేతికొస్తాయి. దాదాపు 40 రోజుల వరకు రోజు విడిచి రోజు కీరలను తెంపి మార్కెట్కు తీసుకెళ్తుంటారు. కాగా.. ఎకరా భూమిలో వేసిన కీర పంట ద్వారా దాదాపు రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. ఎకరా విస్తీర్ణంలో కీర సాగు కోసం రూ.20వేల వరకు పెట్టుబడి ఖర్చులు అవుతాయి. పెట్టుబడి, కూలీలు, రవాణా, పురుగు మందుల ఖర్చులు పోనూ ఎకరానికి రూ.80 నుంచి 90 వేల ఆదాయం పక్కాగా వస్తున్నదని రైతులు సంతోషంగా చెబుతున్నారు. ఇలా ఒక ఏడాదిలో సాగు నీటి లభ్యతను బట్టి 4 నుంచి 5 సార్లు కీర పంటను సాగు చేసుకోవచ్చు. మార్కెట్లో కిలో కీర దాదాపు రూ.50-60 వరకు ధర పలుకుతున్నది.
కీరను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులో 90శాతం వరకు నీరు ఉంటుంది. విటమి న్లు, మినరల్స్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్తో పాటు ఫైబర్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా దాహార్తిని తీర్చేందుకు, ఊబకాయాన్ని తగ్గించడంలో కీర కీలకంగా వ్యవహరిస్తుంది. జీర్ణశక్తిని పెంచేందుకు, కంటి చూపును మెరుగుపర్చేందుకు, రక్తప్రసరణ బాగా జరిగేందుకు దోహదపడుతుందంటున్నారు. వీటితో పాటు రక్తపోటు, మలబద్ధకాన్ని నివారించేందుకు ఎంతో మేలు చేస్తుంది.
నాలుగేళ్లుగా కీర సాగు చేస్తున్న. మంచి లాభాలు వస్తున్నయ్. రెండెకరాల భూమిని కౌలుకు తీసుకున్న. ఎకరంలో కీర పంట వేసిన. ఇంకో ఎకరంలో బీర, సొర, వంకాయ తదితర కూరగాయల పంటలు సాగు చేస్తున్న. కూరగాయ పంటలు పూత దశలో ఉన్నయ్. కీర పంట వేసి నెల దాటింది. వారం రోజుల నుంచి దిగుబడి వస్తున్నది. మా భర్త విజయ్తో పాటు కుటుంబ సభ్యులు కీరను తెంపడానికి వస్తుంటరు. కీరను నిర్మల్ మార్కెట్కు తీసుకెళ్లి స్వయంగా నేనే అమ్ముతా. రోజుకు రూ.3 వేల వరకు ఆదాయం వస్తున్నది. ఖర్చులు పోనూ ఈ పంట మీద లక్ష వరకు లాభం వస్తది.
– రాధ, మహిళా రైతు, సిద్దాపూర్