అసెంబ్లీ ఎన్నికల పర్వం తుదిదశకు చేరుకుంది. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ వెలువడగా.. 30వ తేదీన ఎన్నికలు జరిగాయి. నేడు(ఆదివారం) నాలుగు జిల్లాల్లో ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను, అనంతరం ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. ప్రతి నియోజకవర్గంలో లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.
పోలీసులు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, సిగరేట్లు, వాటల్ బాటిళ్లను అనుమతించరు. సెంటర్స్ పరిధిలో ర్యాలీలకు అనుమతి లేదు. ఎన్నికల నిబంధలను అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు. కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం పూర్తిస్థాయిలో మధ్యాహ్నం వరకు తేలనుంది.
– ఆదిలాబాద్/నిర్మల్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ)
మంచిర్యాల, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరి ఘట్టమైన ఓట్ల లెకింపునకు సమయం ఆసన్నమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. నాలుగు జిల్లా కేంద్రాల్లో నేడు(ఆదివారం) ఓట్ల లెకింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెకింపు ప్రారంభం కానున్నది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం ఈవీఎంలలోని ఓట్లను కౌంటింగ్ చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు, 18 అధికారిక బృందాలను ఏర్పాటు చేశారు. లెకింపు కేంద్రం చుట్టూ మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ముల్కల్ల సమీపంలో గల ఐజా ఇంజినీరింగ్ కాలేజీలో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మూడు ఫ్లోర్స్లోని ఒక్కో ఫ్లోర్లో ఒక్కో నియోజకవర్గ ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేసి కౌంటింగ్ నిర్వహించనున్నారు. రౌండ్స్వారీగా చూసుకున్నట్లయితే 16వ రౌండ్ పూర్తయ్యే సరికి చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలపై స్పష్టత రానుంది. మంచిర్యాల నియోజకవర్గ ఎన్నికల ఫలితం 21వ రౌండ్ తర్వాతనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది.
మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో 287 పోలింగ్ బూత్లు ఉండగా 1,90,057 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓట్ల లెక్కింపు 21వ రౌండ్ తర్వాత గెలుపోటములు ఎవరివో తేలనుంది. చెన్నూర్ నియోజకవర్గంలో 227 పోలింగ్ ఉండగా 1,50,754 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ నియోజకవర్గ ఫలితంపై 17వ రౌండ్ తర్వాత స్పష్టత రానుంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో 227 పోలింగ్ బూత్ల ద్వారా ఎన్నికలను నిర్వహించగా 1,40,732 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నియోజకవర్గ ఫలితంపై 16వ రౌండ్ తర్వాత స్పష్టత రానుంది. ప్రతి రౌండ్కు 16 టేబుల్స్ ఉండగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం నాలుగు టేబుల్స్, సర్వీస్ ఓటర్ల ఓట్ల లెక్కింపు కోసం ఒక టేబుల్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి టేబుల్కు ముగ్గురు అధికారులు, ఒక ఆర్వో, ఒక అబ్జర్వర్, ఒక స్పెషల్ ఆఫీసర్, ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక సపోర్ట్ మెన్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉండనున్నారు.
ఆదిలాబాద్, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలోని అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నేడు(ఆదివారం) జరుగనుంది. నవంబరు 30న ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగగా.. ఆదిలాబాద్లో 79.86 శాతం, బోథ్లో 82.86 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ అనంతరం ఈవీఎంను అధికారులు, సిబ్బంది జిల్లా కేంద్రంలోని సాంకేతిక శిక్షణ, అభివృద్ధి కేంద్రం (టీటీడీసీ)లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంలకు తరలించారు. రెండు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను భద్రపర్చి సీల్వేసి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 290 పోలింగ్ కేంద్రాలు, బోథ్లో 302 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
ఆదిలాబాద్ నియోజకవర్గంలో 1,85,862 ఓట్లు, బోథ్ నియోజకవర్గంలో 172,397 ఓట్లు పోలైయ్యాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 21 రౌండ్లు, బోథ్ నియోజకవర్గంలో 22 రౌండ్స్లో ఓట్ల లెక్కింపు జరిగే అవకాశాలున్నాయి. కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్రాజ్ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన రెండు గంటల్లోనే మొదటి రౌండ్ ఆధిక్యం వెలువడనుండగా.. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే అవకాశాలున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
నిర్మల్, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్కు అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పూర్తి భద్రత మధ్య ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు కళాశాలలోని మూడు హాళ్లను కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో నిర్మల్, మొదటి అంతస్తులో ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల లెక్కింపు జరుగనున్నది. 186 మంది సిబ్బందిని వినియోగించనున్నారు.
వీరిలో కౌంటింగ్ సూపర్వైజర్లు 60 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లు 66 మంది, మైక్రో అబ్జర్వర్లు 60 మంది ఉన్నారు. వీరందరికీ ఇప్పటికే కౌంటింగ్పై శిక్షణ పూర్తి చేయడంతోపాటు కౌంటింగ్ హాళ్లలో అవసరమైన అన్ని వసతులను కల్పించారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ సెంటర్స్ను బట్టి 20 నుంచి 22 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానున్నది. నిర్మల్ నియోజకవర్గంలో 306 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1,95,757 ఓట్లు పోలయ్యాయి. ఖానాపూర్ నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1,72,412 ఓట్లు హక్కు వినియోగించుకున్నారు. ముథోల్లో 311 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 2,01,044 మంది ఓటు వేశారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు, గొడవలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదు. నిబంధనలు అతిక్రమిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. లెక్కింపు కేంద్రంలోకి సెల్ఫోన్లు, వాటర్ బాటిళ్లు, సిగరేట్లు, మద్యం వంటి వాటిని అనుమతించరు. ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్న వారిని మాత్రమే కేంద్రాల్లోకి ప్రవేశం కల్పిస్తారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కించి ఫలితం వెల్లడించనున్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో 1,457, బెల్లంపల్లి నియోజకవర్గంలో 1,104, మంచిర్యాల నియోజకవర్గంలో 2,547 మంది మొత్తం 5,108 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపును పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆసిఫాబాద్, డిసెంబర్ 2 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి నియోజకవర్గానికి 19 చొప్పున కౌంటింగ్ బృందాలు, 14 రౌండ్లు, మూడు పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్కు ఒక సూపర్ వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ చొప్పున టేబుల్కు ముగ్గురు సిబ్బందిని నియమించారు. జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఆసిఫాబాద్కు సంబంధించి 305 పోలింగ్ బూత్లకు 14 టెబుల్స్ ఏర్పాటు చేసి 22 రౌండ్లలో లెక్కింపు చేయనున్నారు. సిర్పూర్కు సంబంధించి 294 పోలింగ్ బూతులకు 14 టెబుల్స్ ఏర్పాటు చేసి 21 రౌండ్లలో లెక్కించనున్నారు. ఆసిఫాబాద్లో 1,83,535 మంది, సిర్పూర్లో 1,85,791 మంది ఓటు వేశారు.