బోథ్, జనవరి 25 : బోథ్ మండలంలో అన్నదాతలు సాగు చేస్తున్న యాసంగి పంటలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. 13058 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అత్యధికంగా 10,863 ఎకరాల్లో శనగ వేశారు. గోధుమ 243, మక్క 703, జొన్న 984, ధనియాలు 95, ఆవాలు 25, వేరుశనగ 11 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వేరుశనగ వేయడానికి మరికొంత సమయం ఉన్నందున సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. 24 గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరాతో పాటు బోరు బావుల్లో సమృద్ధిగా నీరుండడం, ప్రాజెక్టుల కాలువల ద్వారా పొలాలకు నీరు అందుతుండడంతో యాసంగి పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండడంతో పంటలు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పంటలకు నీటి తడులు అందించే అవసరం లేకుండా పోయిందని పేర్కొంటున్నారు.
ఆరు ఎకరాల్లో శనగ సాగు
ఆరు ఎకరాల్లో శనగ సాగు చేస్తున్నా. ఇప్పటికైతే పంట బాగానే ఉంది. వర్షాలతో నేలలో తేమ శాతం అధికంగా ఉండడంతో పంట ఏపుగా పెరిగింది. పూత, కాయ దశలో ఉంది. ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే పరిస్థితి కనిపిస్తున్నది. -బడాల శ్రీకాంత్రెడ్డి, రైతు, కౌఠ(బీ)
గోధుమ, జొన్న పంటలు బాగున్నాయి
యాసంగిలో సాగు చేస్తున్న గోధుమ, జొన్న పంటలు బాగున్నాయి. వాతావరణం ఈ పంటలకు అనుకూలంగా ఉంది. వీటితో పాటు శనగ సాగు చేస్తున్నా. ఈ పంటలకు తక్కువ పెట్టుబడి అవసరం. దిగుబడి బాగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలతో పాటు బయటి మార్కెట్లో ధర ఎక్కువగా పలుకుతుండడంతో పంటలు అమ్మడానికి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
-యాల్ల జైపాల్రెడ్డి, రైతు, కౌఠ(బీ)