మంచిర్యాల ప్రతినిధి(నమస్తే తెలంగాణ)/మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 19 : అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం పంపిణీ చేయాల్సిన కాంట్రాక్టర్లు కాసులకోసం కక్కుర్తిపడి అడ్డదారులు తొక్కుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సర్కారు లక్ష్యానికి గండికొడుతున్నారు.
అగ్మార్క్ నిబంధనల మేరకు గుడ్డు బరువు 45 నుంచి 52 గ్రాములుండాలి. 10 గుడ్లను ఒక యూనిట్గా పరిగణిస్తే.. వాటి బరువు 450 నుంచి 525 గ్రాములుండాలి. ఒక ట్రే లో 30 గుడ్లు ఉంటాయి కాబట్టి.. ట్రే బరువు ను తీసివేసి 1350 గ్రాముల నుంచి 1560 గ్రాములు ఉండాలి. కానీ కాంట్రాక్టర్లు చాలా వరకు నాసిరకం.. బరువు.. పరిమాణం త క్కువ ఉన్న గుడ్లను సరఫరా చేస్తున్నారు. కేవ లం 30 నుంచి 35 గ్రాముల బరువు గల గు డ్లను పంపిణీ చేస్తున్నారు. దీనిని ప్రాజెక్టు పరిధిలో సీడీపీవోలు గమనించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. కానీ అలా జరగడం లేదు. నాణ్యత పర్యవేక్షించాల్సిన సిబ్బంది ఎ లాంటి ఫిర్యాదులు చేయకపోవడంతో కాం ట్రాక్టర్లు మూడు చిన్న గుడ్లు.. ఒక పెద్ద గుడ్డు మాదిరిలా.. కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు.
జిల్లాలో 969 అంగన్వాడీ కేంద్రాలుండగా, గర్భిణులు 4181, బాలింతలు 4835, 1-3 ఏళ్ల పిల్లలు 19,510 మంది, 3 – 6 సంవత్సరాల పిల్లలు 19,435 మంది ఉన్నారు. ఇందులో గర్భవతులు, బాలింతలు, 3 – 6 సంవత్సరాలున్న 28,451 మందికి ఒక్కొక్కరికీ ప్రతి నెలా 30 చొప్పున 8,53,530 కోడి గుడ్లు ఇవ్వాలి. అలాగే ఏడు నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఉన్న 24,011 మంది చిన్నారులకు నెలకు 16 చొప్పున 3,84,176 కోడిగుడ్లు అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉంది. కానీ కాంట్రాక్టరు మాత్రం అధిక సంఖ్యలో చిన్న (30 గ్రాముల) సైజున్న గుడ్లు సరఫరా చేస్తున్నాడు.
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లతో పాటు పప్పు, నూనె, బాలామృతం, పాల ప్యాకెట్లు, మురుకులు, బియ్యం సరఫరా అవుతుంటాయి. పప్పు వేసే కాంట్రాక్టర్ పురుగులు పడ్డ, ఉండలు కట్టిన, చెడిపోయిన పప్పును సరఫరా చేస్తున్నాడు. దానిని ఆయాలు వండాలంటే చెరిగితే సగానికి సగం వేస్టేజీ పోతుందని, నల్ల పురుగులైతే పప్పు గింజలకంటే ఎక్కువ ఉంటున్నాయని చెబుతున్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న గుడ్లపై, పప్పులపై పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లకు వరంగా మారింది. ప్రాజెక్టు పరిధిలో సీడీపీవోలు, సూపర్వైజర్లు కేంద్రాలకు వచ్చిన సరుకులను పరిశీలించకపోవడం, ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఒత్తిడి తేవడంలాంటివి చేస్తున్నారే తప్ప.. కాంట్రాక్టర్ తప్పును చూపించడం లేదు.
అంగన్వాడీ సెంటర్లకు కోడిగుడ్లు, పప్పు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు సీడీపీవోలు కొమ్ముకాస్తున్నట్లు సమాచారం. ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో ‘గుడ్లు గుట్కాయస్వాహా’ పేరిట కథనం ప్రచురితం కాగా, సదరు కాంట్రాక్టర్ను కాపాడేందుకు ఒక సీడీపీవో రంగంలోకి దిగి.. పేపర్లో ప్రచురితం చేసింది తప్పు అని.. సంబంధిత సెంటర్ నుంచి బలవంతంగా రాయించుకున్నట్లు తెలిసింది. లబ్ధిదారుల నుంచి సైతం గుడ్ల సరఫరా సక్రమంగా జరుగుతుందని రాయించుకొని అధికారులకు సమర్పించినట్లు సమాచారం. రిజిస్టర్లో వచ్చిన గ్యాప్లను పరిశీలించి.. గుడ్లు సరఫరా సక్రమంగా జరుగడంలేదని సదరు కాంట్రాక్టర్పై రిపోర్టు చేయాల్సిన సీడీపీవో ఆయనకు సఫోర్టుగా వివరణలు తీసుకోవడం వెనుక అంతర్యమేమిటో అంతుచిక్కడం లేదు. మరోవైపు కలెక్టర్ సైతం చిన్న సైజులో వస్తున్న కోడిగుడ్లను తెప్పించుకొని పరిశీలించినట్లు సమాచారం.
నాణ్యమైన సరుకులు సరఫరా చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని అన్ని సెక్టార్ల సీడీపీవోలు, ప్రాజెక్టులోని సూపర్వైజర్లు ప్రతి అంగన్వాడీ సెంటర్ను పర్యవేక్షించాలి. నాణ్యమైన సరుకులు సరఫరా అవుతున్నాయా.. లేదా.. పరిశీలించాలి. రెండో రిజిస్టర్లో ఏయే నెలల్లో ఎన్ని గ్యాప్లు ఉన్నాయో గమనించాలి. అవకవతకలకు పాల్పడితే చర్యలు తప్పవు.
– కొట్టె చిన్నయ్య, జిల్లా సంక్షేమ అధికారి, మంచిర్యాల