కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సరికొత్త విధానాలను అమలు చేస్తున్నది.ప్రస్తుతం జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు 118 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. ఈ ఆరోగ్య ఉపకేంద్రాల్లో ప్రస్తుతం ఒక్కో ఏఎన్ఎం అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు. ఆయా కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో ప్రజల ఆరోగ్యంపై పర్యవేక్షణ చేయడంతో పాటు టీకాల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే 118 ఆరోగ్య ఉప కేంద్రాల నుంచి 61 కేంద్రాలను పల్లె దవాఖానలుగా.. మరో మూడింటిని బస్తీ దవాఖానలు(మిడిల్ లెవల్ హాస్పిటల్స్)గా ఉన్నతీకరించాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించి ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే జిల్లాలోని కుంచవెల్లి, పంబాపూర్, ఖైర్గాం, బీబ్రా, మొగఢ్దగఢ్, గుండాల, తలండి, మంగి దవాఖానలను పల్లె దవాఖానలు(దాదాపు అందుబాటులోకి వచ్చినట్లే)గా మార్చుతున్నారు. అన్నిచోట్ల ఈ పల్లె దవాఖానలు అందుబాటులోకి వస్తే ఎంబీబీఎస్ లేదా ఆయుష్ వైద్యుడితో పాటు ఫార్మసిస్ట్, ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్ నిత్యం అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించే వీలుంటుంది. ప్రస్తుతం జిల్లాలో ప్రతి 30 వేల నుంచి 50 వేల మందికో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రతి 2 వేల నుంచి 5 వేల మందికో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో అందుబాటులో ఉండగా, ఈ పల్లె దవాఖానల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరువకానున్నాయి.
పీహెచ్సీలపై నిరంతర పర్యవేక్షణ..
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో పాటు వైద్య సిబ్బంది సకాలంలో హాజరయ్యేలా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయబోతున్నది. హైదరాబాద్లోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి కూడా పర్యవేక్షణ చేసే విధంగా కెమెరాలను నెట్ ద్వారా అనుసంధానం చేయనున్నారు. జిల్లాలో ఇప్పటికే కొన్నిచోట్ల కెమెరాలను ఏర్పాట్లు చేసినట్లు జిల్లా వైద్యాధికారి ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఇదేవిధంగా టెలిమెడిసిన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 22
ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు 118 ఉన్నతీకరించే పీహెచ్ఎస్సీలు 61
ఇప్పటికే పూర్తయినవి 8
బస్తీ దవాఖానలుగా మారేవి 3